Rythu Bharosa: తెలంగాణలో రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ ప్రభుత్వం. ఇవాళ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి. మధిరలో రైతు ఆశీర్వాద సభ పెట్టి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. అనుకోకుండా సభ వాయిదా పడడంతో రైతుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణలో అన్నదాతలకు శుభవార్త.. కొత్తవారికి అవకాశం
తెలంగాణలో అన్నదాతలకు బిగ్ రిలీఫ్. మొదట చెప్పినట్టుగానే జూన్ 30న రైతులను రైతు భరోసా నిధులను రేవంత్ ప్రభుత్వం విడుదల చేయనుంది. తొలుత ఖమ్మం జిల్లా మధిరలో రైతు ఆశీర్వాద సభ పెట్టి అందులో నిధులు విడుదల చేయాలని భావించింది ప్రభుత్వం. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడుతుండడంతో ఆ సభను రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
దీంతో నిధుల విడుదల వాయిదా పడుతుందోనన్న సందేహాలు రైతుల్లో వ్యక్తమయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సభా వేదికను మార్చింది ప్రభుత్వం. నిధుల విడుదలలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. ప్రభుత్వ ముందు నిర్ణయించిన ప్రకారం జూన్ 30 సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రైతు ఆశీర్వాద సభ జరగనుంది.
రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ సభలోనే రైతు భరోసా పథకం నిధులు విడుదల చేయనున్నారు. అదే సమయంలో మరొక కొత్త కబురు చెప్పింది. రైతు భరోసా పథకంలో కొత్తగా అర్హులైన రైతులకు మరో అవకాశం కల్పించింది. ఈ పథకంలో నమోదు చేసుకోని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
జూన్ 15 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జూలై 5 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. రైతు భరోసా నగదు తమ ఖాతాల్లో జమ కాలేదని భావిస్తున్న రైతులు.. వ్యవసాయ-రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించింది. సాంకేతిక లేదా ఇతర కారణాలతో నిధులు అందనివారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ALSO READ: క్రికెటర్ గౌరవ్ శర్మ ఫిర్యాదుతో కదిలిన బీసీసీఐ.. అసలు దందా బట్టబయలు..?
తొలిరోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాలోకి దాదాపు రూ.2482.02 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. ఎకరం భూమి కలిగిన 14.65 లక్షల మంది కోసం రూ.878.94 కోట్లు పడనున్నాయి. రెండెకరాలు భూమి కలిగిన 26.72లక్షల మందికి రూ.1,603.08 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతు భరోసా నిధులు దశలవారీగా 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.