HCA Notice: స్వేచ్చ బ్యూరో: వరుస వివాదాలతో సతమతమవుతున్న హెచ్సీఏకు మరో షాక్ తగిలింది. బీసీసీఐ రాజ్యాంగ ఉల్లంఘనలు, సుప్రీం కోర్టు ఆమోదించిన పాలనా సంస్కరణల అమలుపై 4వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని బీసీసీఐ అంబుడ్స్ మన్, ఎథిక్స్ ఆఫీసర్, రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా సోమవారం నోటీస్ జారీ చేశారు. ఇటీవల క్రికెటర్ గౌరవ్ శర్మతోపాటు మరికొందరు ఆటగాళ్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిలో హెచ్సీఏ బీసీసీఐ రాజ్యాంగం ఇప్పటికే సుప్రీం కోర్టు ఆమోదించిన జస్టిస్ ఆర్.ఎం.లోధా కమిటీ సిఫార్సుల అమల్లో ఉల్లంఘనలకు పాల్పడుతోందని పేర్కొన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో సోమవారం జస్టిస్ అరుణ్ మిశ్రా హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు నాలుగు వారాల్లో ఆరోపణలపై సమగ్ర సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించారు. ఫిర్యాదు ప్రతితో పాటు నోటీసును వెంటనే హెచ్సీఏకు అందజేయాలని సూచించారు. బీసీసీఐ అంబుడ్స్ మన్, ఎథిక్స్ కమిటీ నుంచి జారీ అయిన ఈ నోటీస్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయంగా మారింది. హెచ్సీఏపై వచ్చిన ఆరోపణలపై ఇది అధికారిక విచారణ జరపటమే అని పలువురు క్రికెటర్లు వ్యాఖ్యానించారు.
Also read: Illegal Sand: గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం.. యువకుడికి ప్రాణహాని బెదిరింపులు..!
క్రికెటర్లు గౌరవ్ శర్మ తదితరులు చేసిన ఫిర్యాదులో హెచ్సీఐ బీసీసీఐ రాజ్యాంగంలోని 3(b), 3(c), 3(d) నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. సభ్యత్వ వర్గీకరణ, పూర్తి సభ్యుల భౌగోళిక పరిధి, కొత్త రాష్ట్రాల గుర్తింపు, వార్షిక ఆడిట్లు, ఆడిట్ రిపోర్టులు, కార్యవర్గ వివరాల సమర్పణ వంటి అనేక కీలక అంశాల్లో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ పాలనా వ్యవస్థకు విరుద్ధంగా హెచ్సీఏ తన రాజ్యాంగాన్ని సవరించిందన్నారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అసోసియేట్ సభ్యులుగా మాత్రమే ఉండాల్సిన సంస్థాగత సభ్యులకు పూర్తి సభ్యత్వం కల్పించిందని పేర్కొన్నారు.
ఈ పరిణామంపై టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి స్పందిస్తూ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నోటీసు జారీ చేయటం హెచ్సీఏపై వచ్చిన ఆరోపణలు సాధారణమైనవి కావని స్పష్టం చేస్తోందన్నారు. ఈ నోటీసులతో హెచ్సీఏ బహిరంగ ప్రకటనలు కాకుండా చట్టబద్ధమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ జిల్లాల క్రికెటర్ల భవిష్యత్తు, పారదర్శక పరిపాలన, సమాన అవకాశాలు, బీసీసీఐ రాజ్యాంగ పరిరక్షణ గురించి. టీసీఏ చేస్తున్న చట్టబద్దమైన పోరాటం ఈ పరిణామంతో మరింత బలోపేతం అయ్యిందన్నారు. తెలంగాణ జిల్లాల క్రికెటర్ల హక్కులను రక్షించడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
Also read: టాలీవుడ్లో రూ.1300 కోట్ల జూదం.. ఆ ఆరు సినిమాలు తేడా కొడితే అంతే సంగతులా?