RTC Elections: టీజీఎస్ ఆర్టీసీ లో యూనియన్ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు, అనుమానాలకు తెరదించుతూ యాజమాన్యం ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేస్తోంది. యూనియన్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అడుగులు వేగవంతం చేసింది.
ఎన్నికల నిర్వహణ అధికారిగా ప్రభుత్వం నియమించిన జాయింట్ లేబర్ కమీషనర్ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంతో భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీ నేపథ్యంలో యూనియన్ వేరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోలింగ్ బూత్ల వివరాలు, బూత్ ఇన్ఛార్జ్ల జాబితాను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ అధికారికి (జాయింట్ లేబర్ కమీషనర్కు) అందజేసింది.
Also read: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో రూ.2 వేల కోట్లు రిలీజ్.. ఆర్థికశాఖ ఉత్తర్వులు
ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మరో రెండు, మూడు రోజుల్లో ‘ఫస్ట్ నోటీస్’ ఇచ్చేందుకు ఎన్నికల నిర్వహణ అధికారి ( జాయింట్ లేబర్ కమీషనర్) ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా, పారదర్శకంగా ముగిసేలా ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం ఎన్నికల అధికారితో చర్చిస్తూ, సమన్వయం చేసుకుంటోంది.
చివరిసారిగా ఆర్టీసీలో తేదీ 19-07-2016 న ట్రేడ్ యూనియన్ ఎన్నిక జరిగింది. తెలంగాణా మజ్దూర్ యూనియన్ 10 రీజియన్ లలో, 3 నాన్ ఆపరేషన్ యూనిట్లలో మరియు ఖమ్మం రీజియన్ లో మాత్రం ఎస్ డబ్ల్యూ ఎఫ్ (SWF)గెలిచింది. ప్రస్తుతం సుమారు 36000 ఆర్టీసీ కార్మికులకు ఓటు హక్కు ఉంది. ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విస్తృత చర్చ జరుగుతుంది.
Also read: Illegal Sand: గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం.. యువకుడికి ప్రాణహాని బెదిరింపులు..!