Rain Alert In Telangana: అసలు వర్షాలు లేక అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. సెప్టెంబరు 19 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాన కబురు తెలియగానే రైతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణకు చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి ఏర్పడింది. దీని కారణంగా మంగళవారం నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అది కాస్త విస్తరించింది. ఫలితంగా వర్షాలు పడే అవకాశముంది. సెప్టెంబరు 19 నుంచి మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తేల్చిచెప్పింది. 19న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరుసటి రోజు అనగా 20, 21న పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. బుధ, గురువారాల్లో తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
సెప్టెంబరు తొలి రెండువారాలు తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. కేవలం 61 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో సాధారణ వర్షపాతం 86 మిల్లీ మీటర్లు కాగా, ఇంకా 28 శాతం లోటు ఏర్పడింది. గతేడాది ఈ సీజన్లో 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. రుతుపవనాలు వచ్చిన జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 659 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. ప్రస్తుతానికి 535 మిల్లీమీటర్లు నమోదు అయ్యింది. ప్రస్తుత సీజన్లో 19 శాతం వర్షపాతం లోటు నమోదైంది.
జూన్-11.74 శాతం, జులై-1.36, ఆగస్టు-37.67 శాతం లోటు నమోదు అయ్యింది. ఇక సెప్టెంబరులో రెండువారాలకు 29 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధిక లోటు వర్షపాతం నమోదు అయ్యింది. అందులో జోగులాంబ జిల్లా- 45.42 శాతం, హనుమకొండ-41.91 శాతం, వనపర్తి- 40.70 శాతం, నాగర్కర్నూల్-38.67 శాతం, నారాయణపేట-37.42 శాతం లోటు ఉంది. మరి ఈసారైనా వర్షాలు తెలంగాణ అంతా భారీగా పడతాయా? లేదా అనేది చూడాలి.
ALSO READ: వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!