Cheyutha Pension: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘చేయూత’ నూతన పింఛన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5.78 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ నాటికి చేయూత దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగవద్దని స్పష్టం చేశారు. పరిశీలన పారదర్శకంగా సాగేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను మాత్రమే ఉపయోగించాలని, ఎంపీడీవోలు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
Also read: ఏ మతానికి దయా గుణం ఎక్కువ? బిచ్చగాడి ఐడియా అదుర్స్.. గెలుపు ఎవరిదంటే?
లబ్ధిదారుల క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అని సెర్ప్ సీఈవో స్పష్టం చేశారు. అధికారులు నేరుగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి 12 రకాల అంశాలపై ఆరా తీసి, యాప్లో వివరాలు నమోదు చేయాలన్నారు. దివ్యాంగుల పింఛన్ల దరఖాస్తుల్లో ఎవరైనా నకిలీ సదరం సర్టిఫికెట్లు పెట్టినట్లు తేలితే ఏమాత్రం ఉపేక్షించకుండా జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని హెచ్చరించారు. చేనేత, గీత కార్మికుల దరఖాస్తులను తనిఖీ కోసం సంబంధిత శాఖలకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో సోక్ పిట్ల నిర్మాణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని, గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Also read: మెదక్ జిల్లాలో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. 3 ఎకరాల రైతు ఖాతాలో 3,850 ఎకరాల భూమి?