Miryalaguda: స్వేచ్ఛ బ్యూరో: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలో నిమజ్జన కార్యక్రమాలకు పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలో సుమారు *1,700 వినాయక విగ్రహాలను* ఏర్పాటు చేశారు. నేడు మూడో రోజు కావడంతో వేములపల్లి, 14 మైల్, నాగార్జునసాగర్, వాడపల్లి ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనాలు నిర్వహించుకోవచ్చని మిర్యాలగూడ సబ్డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ రవి తెలిపారు. భక్తులు, ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని డీఎస్పీ రవి స్పష్టం చేశారు. నిమజ్జన యాత్రల్లో డీజేలు ఏర్పాటు చేసి నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉత్సవాల పేరుతో నిబంధనలను అతిక్రమించడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు.
వినాయక ఉత్సవాల నిర్వాహకులు నిమజ్జనానికి విగ్రహాన్ని తరలించే ముందు ఊరేగింపు వెళ్లే మార్గాన్ని పోలీసులకు ముందుగానే తెలియజేయాలని డీఎస్పీ సూచించారు. రూట్ మ్యాప్ను పోలీసులకు అందించడం ద్వారా నిమజ్జన యాత్రలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, ఇతర ముందస్తు చర్యలను సులభంగా చేపట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. ఊరేగింపు సమయంలో నిర్ణయించిన మార్గాన్ని మార్చకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. భారీగా భక్తులు తరలివచ్చే ప్రాంతాల్లో ఎలాంటి తొక్కిసలాట, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also read: ఏ మతానికి దయా గుణం ఎక్కువ? బిచ్చగాడి ఐడియా అదుర్స్.. గెలుపు ఎవరిదంటే?
గణేష్ నిమజ్జనాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీలపై కూడా ఉందన్నారు. నిమజ్జన యాత్రలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. భక్తులు, యువత అత్యుత్సాహానికి వెళ్లకుండా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. పోలీసుల సూచనలు, ఆదేశాలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా ముగించాలని తెలిపారు.
గణేష్ ఉత్సవాలు విజయవంతంగా పూర్తయ్యేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని డీఎస్పీ రవి తెలిపారు. ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు సూచించే భద్రతా చర్యలను పాటించాలని చెప్పారు. ప్రమాదరహితంగా.. విషాదరహితంగా గణేష్ నిమజ్జన వేడుకలు నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని డీఎస్పీ రవి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఉత్సవాలను ప్రశాంతంగా, సంతోషకర వాతావరణంలో పూర్తి చేయవచ్చని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ పట్టణ సిఐలు నాగభూషణం, సోమ నరసయ్య ఉన్నారు.
Also read: విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!