మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2023లో పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి జరిగిన అన్ని ఉపఎన్నికలు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడం.. కుటుంబం ముక్కలు అవ్వడం ఆయన్ను తీవ్రంగా కలిచివేసినట్టు తెలుస్తున్నది. అందుకే ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. దీనికి తోడు వయస్సు మీద పడటం, అనారోగ్య సమస్యల కారణంగా ఆయన బయటకు రావడం లేదని చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకు రావడం కోసం పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.ఈ మేరకు కేంద్రంలో ఉన్న బీజేపీతో చర్చలు జరపాలని ఆలోచన చేస్తున్నట్టు టాక్.
లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవితను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ఉన్నది. దాదాపు రెండు నెలల పాటు ఆమె ఢిల్లీలోని తిహార్ జైలులో గడిపారు.అయితే, తన బిడ్డను బయటకు తీసుకురావడానికి కేసీఆర్ చాలా ఇబ్బందులు పడినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కేసీఆర్ అప్పుడు కేంద్రంతో ఢీ కొంటానని పలుమార్లు స్టేట్మెంట్స్ ఇచ్చారు. తీరా చూస్తే కేంద్రంలోని మోడీ, అమిత్ షాలు కేసీఆర్కు షాక్ ఇచ్చారు. బడా లాయర్లను పెట్టుకున్న కేసీఆర్.. ఎట్టకేలకు కవితను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు. ఆమె జైలు నుంచి బయటకు వచ్చాక తన తండ్రికి రాసిన లేఖ లీక్ కావడంతో ఆమె బీఆర్ఎస్కు వ్యతిరేక స్టాండ్ ఎంచుకున్నారు.
ఈ క్రమంలోనే కవిత మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కేసీఆర్ అంగీకరించారని.. ఇదే ప్రతిపాదనను తన వద్దకు తేగా తాను తిరస్కరించినట్టు కవిత ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. దీంతో బీఆర్ఎస్ పెద్దల గుండెల్లో రైలు పరిగెత్తాయి. ఆ తర్వాత క్రమంగా పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై ఆమె లీకులు ఇస్తూ వచ్చారు..ఈ క్రమంలోనే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని కేసీఆర్ అంగీకరించడంతో ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చింది. కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత జాగృతిని పార్టీగా మార్చబోతున్నట్టు లీకులు ఇచ్చింది.
BRS Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా..!
ఈ పరిణామాలతో పాటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎదురుగాలి వీస్తుండటంతో గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావులు పార్టీని తమ భుజాలపై వేసుకుని మోస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో పార్టీ గ్రాఫ్ పడిపోతుండటంతో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ను మరల అధికారంలోకి తీసుకురావాలని.. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తునట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీదున్న వ్యతిరేకత ఎలాగైన తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు సైతం ఆగిపోతాయని.. భవిష్యత్లో బీజేపీని ఎదగకుండా చేయాలని సైతం గులాబీ బాస్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.కాగా, దీనిపై కేసీఆర్ అధికారికంగా స్పందించాల్సి ఉన్నది.