కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్వత్వానికి, ఏఐసీసీ మెంబర్ షిప్కు సైతం రాజీనామా చేశారు.తన సొంత నియోజకవర్గం జగిత్యాలలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ఈ సందర్భంగా తన రాజీనామాకు గల కారణాలను బహిరంగంగా వెల్లడించారు. మాజీ మంత్రి గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంలో తనకు ఘోర అవమానం జరిగిందని, సీనియర్ అని చూడకుండా గత కొంతకాలంగా తనను అవమానిస్తూ వస్తున్నారని వాపోయారు. జీవన్ రెడ్డితో పాటే సుమారు 1500 మంది కార్యకర్తలు సైతం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తున్నది.
ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల ముందు నుంచే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తనను కనీసం గౌరవించలేదని, పదవులు ఇవ్వకపోగా తన సొంత నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ అవమానించిందని పేర్కొన్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద జగిత్యాల ఎమ్మెల్యేగా పోటి చేసిన డాక్టర్ సంజయ్ కుమార్.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జీవన్ రెడ్డిని ఓడించారు. తాను ఓడిపోయినా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సీనియార్టీ ప్రకారం తనకు పదవులు వస్తాయని, అనచరులకు సైతం న్యాయం చేయాలని ఆయన భావించారు. కానీ, మాజీమంత్రికి కనీసం ఎమ్మెల్సీ పోస్టు కాదు కదా.. నామినేటెడ్ పోస్టులు కూడా రాలేదు. దీంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరడం, స్థానికంగా పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం పెరిగింది. దీనిని మాజీ మంత్రి, ఆయన అనుచరులు తీసుకోలేకపోయారు. దీంతో జీవన్ రెడ్డి మీద ఒత్తిడి పెరిగింది. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నాటి నుంచి గుర్రుగా ఉన్నారు.
జీవన్ రెడ్డి పార్టీని వీడుతారని గత వారం రోజులుగా ప్రచారం జరగడంతో మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయన్ను కలిసి రిక్వెస్ట్ చేసినా ఆయన మనసు మార్చుకోలేదని తెలిసింది. సీఎం రేవంత్ నుంచి ఆయనకు ఎటువంటి హామీ లభించకపోవడం, గత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఆ తర్వాత ఆయన్ను అధిష్టానం పట్టించుకోకపోవడంతో రాజీనామాకే జీవన్ రెడ్డి మొగ్గుచూపినట్టు సమాచారం. కాగా, ఆయన భవిష్యత్ కార్యాచరణ మాత్రం ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే బీఆర్ఎస్లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మాజీమంత్రి, సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీని వీడటం ఆ పార్టీకి నియోజకవర్గంలో మైనస్ అనే చెప్పాలి.కానీ, పొలిటికల్ పరంగా చూసుకుంటే ఆయన గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఒకసారి ఎమ్మెల్సీగా ఆయనకు చాన్స్ ఇచ్చింది. తన పనితీరులో మాత్రం ఎటువంటి మార్పు లేదు. నియోజకవర్గంలో జీవన్ రెడ్డి పట్టుకోల్పోయినట్టు తెలుస్తోంది. అందుకే అధిష్టానం సైతం ఆయన్ను లైట్ తీసుకున్నట్టు సమాచారం. సంజయ్కు స్థానికంగా పలుకుబడి ఉండటం, ప్రజల్లో మంచి పేరు ఉండటంతో ఆయన్ను పార్టీ ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి ప్రజాదారణ ఉన్న వ్యక్తే కావాలని అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ సైతం జీవన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని తెలుస్తోంది.