Petrol Shortage: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు సరఫరా నిలిచిపోతుందనే పుకార్లు హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా కలకలం రేపాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకుంటాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడంతో, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తాయన్న భయంతో, వాహనదారులు తమ వాహనాలకు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి బంకుల వద్దకు పోటెత్తారు.
హైదరాబాద్లో పెట్రో కల్లోలం..
ఇక నగరంలోని ముఖ్య ప్రాంతాలైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. పెట్రోల్ బంకులు వాహనాలతో కిక్కిరిసిపోగా, క్యూ లైన్లు ప్రధాన రహదారుల వరకు విస్తరించాయి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వాహనదారులు బారులు తీరడం గమనార్హం. కేవలం వాహనాలకే కాకుండా, ముందు జాగ్రత్తగా ప్లాస్టిక్ డబ్బాలు, బాటిళ్లతో వచ్చి ఇంధనాన్ని నింపుకోవడానికి జనం పోటీ పడ్డారు.
కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు..
ఈ అకస్మాత్తు రద్దీ కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బంకుల బయట రోడ్ల మీదే వాహనాలు నిలపడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ఆఫీసులకు వెళ్లేవారు, అత్యవసర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ, వాహనాల తాకిడి తగ్గకపోవడంతో నియంత్రించడం కష్టతరంగా మారింది.
హైదరాబాద్తో పాటు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక బంకుల వద్ద సరఫరా నిలిచిపోతుందన్న భయంతో గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అధికారులు ఎన్ని హామీలు ఇస్తున్నప్పటికీ, ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావం కారణంగా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. పెట్రోల్ బంకు యాజమాన్యాలు కూడా వాహనదారులను నియంత్రించలేక చేతులెత్తేస్తున్నారు.
Also Read: ఫార్ములా ఈ కార్ లొట్టపీసు కేసు.. మరి భయం ఎందుకు సారు!
పెట్రోల్ కొరతపై రూమర్స్ నమ్మొద్దు..
ప్రస్తుతానికి చమురు కంపెనీలు లేదా ప్రభుత్వం ఇంధన కొరతపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. క్షేత్రస్థాయిలో సరఫరా సాధారణంగానే ఉన్నప్పటికీ, కేవలం పుకార్ల వల్లే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు అనవసరంగా భయపడి భారీగా నిల్వ చేసుకోవడం వల్లే ఇంధన పంపిణీలో అంతరాయం కలుగుతోందని, సంయమనం పాటించాలని అధికారులు కోరుతున్నారు.