రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం ఆర్థికశాఖమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే, ప్రభుత్వం ఏదైనా ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వాలి. బడ్జెట్లో ఏమైనా తప్పులు దొర్లితే వాటిని సవరించాలి. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి.కానీ, అధికారం కోల్పోయిన నాటి నుంచి మాజీ సీఎం, గులాబీ బాస్ సభకు రావడం లేదు. కేవలం రెండు సార్లు అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ బుక్లో సంతకం చేసి వెళ్లిపోయారు. అటెండెన్స్ లేకపోతే శాసనసభ సభ్యత్వం రద్దువుతుందనే ఆయన హాజరు వేసుకుని వెళ్తున్నారని అధికారపార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. గత రెండేండ్లుగా ఒక్క బడ్జెట్ సెషన్లో నూ కేసీఆర్ లేకపోవడం గమనార్హం.
కేసీఆర్ పదేండ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అధికారంలో ఉన్నప్పుడు సభకు హాజరైన ఆయన.. నాడు ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన సభకు వచ్చి తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి సలహాలు, సూచనలు, తన అనుభవాన్ని పంచుకునే అవకాశం ఉన్నది. ప్రభుత్వం సైతం అదే ఆశిస్తున్నది. కానీ, కేసీఆర్ మాత్రం సభకు హాజరుకావడం లేదు. తన కంటే చిన్నవాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు.. తన పరువుకు భంగం వాటిల్లుతుందని, లేదా రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు తనను ప్రశ్నలు అడిగితే చిన్నతనంగా ఫీల్ అయ్యే చాన్స్ ఉందేమో? అందుకే రావడం లేదని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా, సభకే రాని వారికి ప్రతిపక్ష హోదా ఎందుకు? అని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా సీఎం రేవంత్ నిన్న సాయంత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ సెషన్కు అయినా కేసీఆర్ హాజరు కావాలని ఆయన కోరారు. ఒకవేళ సభకు రాకపోతే ఆయనకు ఎందుకు ప్రభుత్వం జీతం చెల్లించాలనే ప్రశ్నను లేవనెత్తారు. ఇప్పటివరకు కేసీఆర్ రూ.1.06లక్షల వేతనం తీసుకున్నారని.. కానీ సభకు, సమావేశాలకు హాజరుకావడం లేదన్నారు. అదంతా ప్రజల సొమ్మే అని.. విధులకు రానప్పుడు జీతం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై మాట్లాడుతారనే కదా? ఆయన్ను ప్రజలు గెలిపించింది అని.. సభకు రాకుండా ఫాంహౌస్లోనే ఉంటే తనకు ఓట్లు వేసిన వారి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు.
ఇక మీదట సభుకు రాని సభ్యుల జీతాలు కట్ చేయడం లేదా తిరిగి వసూలు చేయడంపై ఆలోచన చేయాలని సీఎం తన అభిప్రాయాన్ని సభావేదికగా ప్రకటించారు. కాగా, దీనిపై కేసీఆర్ ఇంతవరకూ స్పందించలేదు. సీఎం రేవంత్ ఆహ్వానం మేరకు ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? లేక జీతం వెనక్కి తిరిగి ఇచ్చేస్తారా? ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ జరుగుతున్నది. ఒకవేళ జీతం తిరిగి ఇచ్చేయాలని కేసీఆర్ అనుకంటే మరల అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదని.. మరల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పవర్లోకి వస్తే సీఎంగా సభలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని.. లేదంటే క్రియాశీలక రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పినట్టే అని ప్రచారం జరుగుతోంది.