తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మునుపెన్నడూ లేనంతగా ముదురుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశంపై దూకుడు పెంచారు. తనపై నిరాధారమైన, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఆరోపణలు చేసినందుకు గానూ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్లకు ఆయన శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు.
గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దేశ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా ఫోన్లు వింటుందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘దేశ భద్రత కోసం ఫోన్లు వినడం వేరు, కానీ మీరు రాజకీయ ప్రత్యర్థులు, హీరోయిన్లు, జడ్జీల పేర్లను మావోయిస్టుల జాబితాలో చేర్చి వారి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారు” అంటూ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
మరోవైపు ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక అడుగు ముందుకేసి కేటీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ కేవలం డ్రగ్స్ వాడటమే కాకుండా, ఆయన ఒక డ్రగ్ పెడ్లర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ తన తరపు న్యాయవాది ద్వారా ఇద్దరు ఎంపీలకు నోటీసులు పంపారు. ఐదు రోజుల్లోగా తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
రాజకీయ లబ్ధి కోసం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అబద్ధాలను ప్రచారం చేయడం సరికాదని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన పేరును లాగుతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ALSO READ: CM Revanth: టీ-హబ్ స్టార్టప్లకే సొంతం.. అమెరికా పర్యటన నుంచే సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..