![MIM party Strategy MIM party Strategy](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/11/3eef284e80280be9aff8a80800dae3f3-65603517282ab.jpg)
MIM party Strategy(TS assembly election updates):
మజ్లిస్ పార్టీ రహస్య రాజకీయాలు మైనార్టీలకు శాపంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీతో MIM లోపాయకారీ ఒప్పందంతో సీక్రెట్ అజెండా అమలు చేస్తోంది. ముస్లింల ఓట్లు చీలుస్తూ హిందూత్వ వాదం వినిపిస్తున్న కమలం పార్టీ విజయానికి బాటలు వేస్తోంది. లౌకికవాద పార్టీ అయిన కాంగ్రెస్ గెలవకుండా మజ్లిస్ కుయుక్తులు పన్నుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్తో స్నేహం చేస్తూ పాలిటిక్స్ను గందరగోళంలో పడేస్తోంది. ఇక్కడ ఏకంగా మూడు పార్టీలు బీఆర్ఎస్-బీజేపీ-MIM అండర్ స్టాడింగ్తో వెళ్తున్నాయనే వాదనలు ఉన్నాయి. గోషామహల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్కు పోటీగా మజ్లిస్ ప్రత్యర్థిని నిలుపకపోవడం.. జూబ్లీహిల్స్లో మైనార్టీ నేత అజారుద్దీన్పై పోటీకి మరో ముస్లింను దింపి ఓడించాలని కుట్రలు చేయడం బట్టబయలయ్యాయి. ఇటు బీజేపీకి అటు బీఆర్ఎస్కు ముస్లిం ఓట్లు వేసేలా ఓవైసీ సోదరులు తమను పావుగా వాడుకుంటున్నారని ముస్లిం సమాజం గుర్తించింది. ఈసారి ఎంఐఎంకి ఏడు సీట్లు దక్కే అవకాశం కూడా లేదని పొలిటికల్ టాక్ నడుస్తోంది. జూబ్లీహిల్స్ అజారుద్దీన్ ఓడించే ప్రయత్నాలు చేస్తూ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే తప్పేంటని? సమర్థించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలని బీజేపీతో కలిసి MIM చేస్తున్న కుట్రలు ముస్లింల ప్రయోజనాలకు విఘాతంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింలకు కల్పించినా 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించింది. ఏకంగా ఈ అంశాన్ని మేనిఫెస్టోలోనూ చేర్చింది. రద్దు చేసిన 4 శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలు, ఇతర వర్గాలకు కల్పిస్తామని అంటోంది. మరి ఇదే జరిగితే తమ పరిస్థితి ఏంటని ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మజ్లిస్ పార్టీ మాత్రం ఇదే జరగాలని బలంగా కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావాలని కమలం పార్టీ కోరుకుంటోంది. హంగ్ తరహా ఫలితాలు ఉండాలని భావిస్తోంది. అప్పుడు బీఆర్ఎస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ఇటీవల కేటీఆర్ను సీఎంగా ఆశీర్వదించాలని కేసీఆర్ తనను కోరారని మోడీ స్వయంగా చెప్పారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా అంగీకరించారు. ప్రైవేటుగా జరిగిన సంభాషణను ప్రధాని బయట పెడతారా అని తప్పుపట్టారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ కూడా మోడీ మాటలు అన్నీ నిజమేనా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ డబ్బులు సర్ధాడని మోడీ కామెంట్స్ చేశారని అది నిజమేనా అంటూ మీడియాపై ఎదురుదాడికి దిగారు.
రాష్ట్రంలో బీజేపీ చెబుతున్న సంకీర్ణ ప్రభుత్వం ఉంటే మజ్లిస్ రోల్ ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీ హామీ మేరకు ముస్లిం రిజర్వేషన్లు రద్దైతే బాధ్యత ఎవరిది? బీఆర్ఎస్కు ఓట్లేయాలని పిలుపునిస్తున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్ దీనికి ఎలా అడ్డుపడతారనే క్వశ్చన్స్ రెయిజ్ అవుతున్నాయి. అయితే ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావాలనేదే ఓవైసీ బ్రదర్స్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇదే వాళ్లు బలంగా కోరుకుంటున్నట్లున్నారు. ముస్లిం రిజర్వేషన్లు ర్దదైతే ఆ సాకుతో రాజకీయ విద్వేషాలు మరింత రెచ్చగొట్టి పబ్బం గడపవచ్చనే ప్లాన్గా కనిపిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందనే టాక్ నడుస్తోంది. ముస్లింల అభివృద్ధిపై ఇటు బీఆర్ఎస్కు గానీ.. అటు మజ్లిస్కు గానీ చిత్తశుద్ధి లేదని క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. రిజర్వేషన్లు పెంచాలంటూ గులాబీ పార్టీ తీర్మానంతో సరిపెట్టింది. అలాగే గిరిజనుల రిజర్వేషన్లు కూడా పెంచాలని తూతూ మంత్రంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంది. ఒకవేళ మైనార్టీ రిజర్వేషన్లు తొలగించినా కేసీఆర్గానీ, ఓవైసీ బ్రదర్స్గానీ అడ్డుకునే పరిస్థితి ఉండదు. దీన్నో రాజకీయ అస్త్రంగా మలచుకుని దేశవ్యాప్తంగా మరింత లబ్ధి పొందేలా కుట్రలకు తెరలేపే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
మజ్లిస్ అధినేత కూడా దీనికి బలం చేకూర్చే వాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఈసారి ఇక్కడ పప్పులు ఉడకడం లేదని పసిగట్టిందని అసదుద్దీన్ మీట్ ది ప్రెస్లో కామెంట్ చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని కమలం పార్టీ చూస్తోందని.. దాని ఫలితంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తోందని అంటున్నారు. పనిలో పనిగా ప్లాన్ బి-కూడా రెడీ చేసుకున్నట్లు అసద్ మాటల్లో కనిపిస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన కల్పించినవి కావంటున్నారు. ముస్లిం సామాజిక వర్గంలో ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన వారికి మాత్రమే అమలు చేస్తున్నారని చెబుతున్నారు. పీఎస్ కృష్ణన్, మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్ అమలవుతోంటే బీజేపీకి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి.. రిజర్వేషన్లు పెంచాలని మోడీ ప్రభుత్వానికి పంపితే మంజూరు చేయలేదని.. ఇప్పుడు రద్దు చేస్తామని బీజేపీ చెబుతోందని ఫైరవుతున్నారు.
ముస్లింల అభివృద్ధిపై నిజంగా మజ్లిస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించిందనే పాజిటివ్గా ఎందుకు తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ను బలహీన పరిచే కుట్రలు చేస్తున్న ఓవైసీ.. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ వల్లే బీజేపీ బలపడిందని ఎదురుదాడికి దిగుతున్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ కోసం తలుపులు మూసేశామని రాహుల్ చెబుతున్నారని.. ఇండియా కూటమిలో ఎలా భాగస్వాములం అవుతామని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.