Khammam News: స్వేఛ్చ బ్యూరో: నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఒకవైపు సాగుతుండగా.. మరోవైపు సక్సెస్ ఫుల్గా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులంతా గెలుపు పైనే దృష్టి సారించారు. రణ క్షేత్రంలో పోరుకు నడుంకట్టారు. కార్యకర్తలు వెంటరాగా అన్ని ప్రచార హంగులతో క్షేత్రస్థాయిలో బిజీ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్ మినహా, కొత్తగూడెంకార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇబ్బడి ముబ్బడిగా నామినేషన్లు దాఖలు చేయడంతో అన్ని పార్టీలకు అభ్యర్థి ఉపసంహరణ సమయం కీలకంగా మారింది. ఇక అసంతృప్తులకు గాలం వేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ(CPI) అన్ని స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసింది. కాంగ్రెస్ సిపిఐతో పొత్తు పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ఒక వేళ కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు సక్సెస్ అయితే మిగతా చోట్ల కూడా పొత్తు పెట్టుకునే బరిలో నిలుస్తాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్కు, అశ్వారావుపేట, ఇల్లందు మున్సిపాలిటీలకు అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి ఇప్పటి వరకూ 326 నామినేషన్లు దాఖలు చేశారు.
Also Read: Ram Pothineni: రూట్ మార్చేసిన రామ్.. హిట్ కోసం ఎప్పుడు చెయ్యని రిస్క్..!
నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా.. మేయర్ పీఠం ఎస్టీ జనరల్కు రిజర్వు అయింది. కాగా ఇక్కడ అధికారంలో ఉన్న సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonamneni Sambasiva Rao) కార్పొరేషన్ చైర్పర్సన్ పీఠం పై ఎర్ర జెండా ఎగురవేయాలని చాలా కృషి చేస్తున్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్(Congress) 48 స్థానాలకు బీఆర్ఎస్ 40 స్థానాలకు నామినేషన్ దాఖలు చేసింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో అశ్వారావుపేటలోని 22 కు గాను కాంగ్రెస్ 18 స్థానాలకు నామినేషన్ దాఖలు చేయగా బీఆర్ఎస్ 22 స్థానాల్లో నామినేషన్ దాఖలు చేసింది. ఇక్కడ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఇల్లందు 24 మున్సిపాలిటీ స్థానాలకు కాంగ్రెస్ నుంచి 28, బీ. ఆర్. ఎస్ నుంచి 34 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ ఛైర్ పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇల్లందు మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లనుంచి రెబల్స్ అభ్యర్థి పోటీ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న పోటీ తత్వాన్నీ క్యాష్ చేసుకుని రెబల్స్ మద్దతు బీఆర్ఎస్ పొందేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైరాలో బీఆర్ఎస్ సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక్కడ జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఏదులపురంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. ఇక్కడ 32 స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ 25మందిని ప్రకటించింది. ఏడు స్థానాలు సీపీఐకి కేటాయించింది. సత్తుపల్లి(Sathupally)లో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాల పై ప్రధాన పార్టీల నేతలందరూ కన్ను వేయడంతో పోటీ తీవ్రంగా ఉంది.
పొత్తుల అంశం పై సానుకూల ధోరణిలో ఉన్న పార్టీ లు ముందైతే నామినేషన్ వేయండని సంకేతం ఇవ్వడంతో ఆశావహులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఇక పోటీ పక్కా ఏ పార్టీ అన్న సంగతి తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు మరికొన్ని మున్సిపాలిటీల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పక్క పార్టీల వైపు జంపింగ్ బ్యాచ్లు ఆశగా చూస్తున్నారు.
Also Read: Parasakthi OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?