![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/12/6190df6b9dfadcb413f0d0e3b768888a.jpg)
Ponnam Prabhakar | తెలంగాణలో బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం తెలిపారు. త్వరలో బిసీబంధు పథకంపై రివ్యూ నిర్వహించి.. పథకం అమలు ప్రక్రియను పారదర్శకంగా చేపడతామన్నారు. పథకం అమలులో బిఆర్ఎస్ ప్రభుత్వం గందరగోళం సృష్టించిందన్నారు. ఈ కారణంగా అర్హులైన బీసీ కులస్తులకు పథకం ద్వారా లాభం పొందే అవకాశం లేకుండా పోయిందన్నారు.
గాంధీభవన్లో మీడియాతో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. “తుక్కుగుడ విజయభేరీ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటినీ అమలు చేశాం. మిగతా 4 గ్యారంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తాం. కాంగ్రెస్ హస్తం గుర్తంటేనే అంటేనే భరోసా. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 9 వేలకు పైగా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. మహాలక్ష్మీ పథకం అమలు ద్వారా ప్రతి రోజు సగటును 45 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచిత జర్నీ చేస్తున్నారు. ఆడబిడ్డలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఖర్చు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుంది. మరోవైపు ఆర్టీసీ సంస్థను బిఆర్ఎస్ పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయలేదు. అతి త్వరలో ఆర్టీసీపై రివ్యూ చేసి ఉద్యోగులు, ప్రజలకు మేలు జరిగేలా ముందుకు వెళ్తాం.
రైతు బంధుపై మాజీ మంత్రులు బిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా పూర్తి కాలేదు, అప్పుడే విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తి స్థాయిలో తప్పకుండా చేస్తాం. బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయి అర్ధంలేని వ్యాఖ్యలు చేయడం సరికాదు,” అని అన్నారు.