Raja Singh: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా ముగ్గురు MLCలు సంతకం చేశని… అయినా నామినేషన్ వేయనివ్వలేదని రాజాసింగ్ ఆరోపించారు. MLCలకు ఫోన్ చేసి భయపెట్టారని అన్నారు. వాళ్లు అనుకున్న వాళ్లకే అధ్యక్ష పదవి ఇచ్చారని రాజాసింగ్ మండిపడ్డారు.
పార్టీకి రాజీనామా లేఖ ఇచ్చానని.. స్పీకర్కు సమాచారం ఇవ్వాల్సిందిగా కిషన్రెడ్డికి చెప్పానని రాజాసింగ్ చెప్పారు. పార్టీ కోసం సర్వం ధారపోశానని, టెర్రరిస్టులకు కూడా టార్గెట్గా మారానని అన్నారు. పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నానని, మీకో దండం, మీ పార్టీకో దండం అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి వైదొలిగినా హిందూవాదిగా కొనసాగుతానని, ధర్మాన్ని కాపాడతానని రాజాసింగ్ చెప్పారు.
చాలా రోజులుగా పార్టీ నడుస్తున్న తీరుపైన, రాష్ట్రానికి సంబంధించిన అగ్రనాయకత్వంపైన.. రాజాసింగ్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. తన అసంతృప్తిని బయటపెడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు అధ్యక్ష ఎన్నిక సందర్బంగా ఆయన.. పార్టీకి రాజీనామా చేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రాజీనామా లేఖలో అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు. పార్టీ గెలుపుతీరాలకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో పార్టీ బాగా పుంజుకుంటున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీ నష్టపోతుందంటూ.. ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. పార్టీకోసం కష్టపడే అనేక మంది కార్యకర్తల గొంతుకగా నేను వనిపిస్తున్నానంటూ ఆయన చెబుతూ వస్తున్నారు.
రాజాసింగ్ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం రాష్ట్ర అధ్యక్ష ఎంపిక. మాములుగా ఎప్పుడూ దూకుడుపై ఉండే రాజాసింగ్.. గత కొన్ని రోజులుగా ఈ అధ్యక్ష పదవి విషయంలో పార్టీ లైన్ తప్పి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ ఎన్నిక ఫెయిర్గా ఉండాలని చెబుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేరును ఖరారు చేసింది. ఇది రాజాసింగ్కు ఆగ్రహం తెప్పించింది. అలా ఎలా డిసైడ్ చేస్తారు? నేను పోటీలో ఉంటా? దరఖాస్తు చేసుకుంటా? అంటూ మాట్లాడారు. కానీ ఆయనకు సరైన మద్దతు లభించలేదు. దీంతో మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ మొత్తం పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేశారు.
Also Read: పొలిటికల్ హీట్.. సోషల్ మీడియాలో కొండా సుస్మిత సంచలన పోస్ట్..
ఎమ్మెల్యే పదవి విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి రాజాసింగ్ ఎలాంటి రాజీనామా అయితే చేయలేదు కానీ.. తాను మీ పార్టీ వాడిని కాదని స్పీకర్కు చెప్పాలంటూ ప్రస్తుత పార్టీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెగేసి చెప్పినట్టు చెబుతున్నారు రాజాసింగ్. మరి రాజాసింగ్ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఇప్పటికే ఆయన నిర్ణయంపై నేతలు ఫైర్ అవుతున్నారు. ఇది పద్ధతి కాదంటున్నారు.