Jeevanreddy : అధికార దుర్వినియోగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ తో పోల్చుకునే నైతికత టీఆర్ఎస్, బీజేపీలకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వడంలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన సబ్సిడీలు నిలిపేశాయని ఆరోపించారు.
తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంపై జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు . వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో సరిపెట్టుకోకుండా అవసరమైన సిబ్బందిని నియమించాలని సూచించారు. గతంలో ఉన్న ఈఎన్ టీ, డయాలసిస్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సేవలను పునరుద్ధరించాలని కోరారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో 5 డయాలసిస్ యూనిట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ధర్మపురి, కోరుట్లలోనూ డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నారని అయితే ఆ అధికారం కేంద్రం చేతిలో ఉందన్నారు. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు బడ్జెట్ కేటాయించే అధికారం మాత్రమే కేసీఆర్ కు ఉందన్నారు. కేసీఆర్ జర్నలిస్టులను మోసం చేశారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.