TSPSC latest news: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యదర్శిగా.. ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్ నికోలసన్ ను నియమించింది ప్రభుత్వం. రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్ అధికారులను, 1 ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నికోలస్ గతంలో గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడిగా పనిచేసినపుడు గురుకుల నియామక బోర్డు కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియను పర్యవేక్షించిన అనుభవం ఆయనకు ఉంది. ఇక ఇటీవలే ఐఏఎస్ లుగా పదోన్నతులు పొంది వెయిటింగ్ లో ఉన్న సీతాలక్ష్మి, ఫణీంద్రరెడ్డిలకు కూడా పోస్టింగులు ఇచ్చింది. ఐఎఫ్ఎస్ అధికారి VSNV ప్రసాద్ పౌర సరఫరాల సంచాలకుడిగా నియమితులయ్యారు.
ఇప్పటి వరకూ TSPSC కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్ ను పంచాయతీరాజ్ కమిషనర్ గా బదిలీ చేసింది. చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ గా ఉన్న బాలమాయాదేవిని బీసీ సంక్షేమశాఖ కమిషనర్ గా, పంచాయతీరాజ్ కమిషనర్ గా ఉన్న ఎం హన్మంతరావును సమాచార, పౌర సంబంధాల కమిషనర్ గా నియమించింది. సమాచార, పౌర సంబంధాల కమిషనర్ గా ఉన్న కె. అశోక్ రెడ్డిని ఉద్యాన డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే.. వ్యవసాయ కమిషనర్ బి.గోపి ని మత్స్యశాఖ కమిషనర్ గా నియమించింది. క్రైస్తవ మైనారిటీ సంస్థ ఎండీ నిర్మల కాంతివెస్లీని స్త్రీ, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్ గా బదిలీ చేసింది. చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ గా జి. ఫణీంద్రరెడ్డిని, ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా సీతాలక్ష్మిలను నియమించింది. జూ పార్కుల డైరెక్టర్ గా ఉన్న వీఎస్ ఎన్ వీ ప్రసాద్ ను పౌరసరఫరాల డైరెక్టర్ గా బదిలీ చేసింది.