Two People Died with Monkey Fever in Karnataka: ప్రపంచంలో ఎప్పుడూ ఏదొక వైరల్ వైరస్, వైరల్ ఫీవర్లు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఎబోలా, కరోనా, మంకీ ఫీవర్.. చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. గతేడాది టెన్షన్ పెట్టిన మంకీఫీవర్.. ఇప్పుడు మళ్లీ కలవరపాటుకు గురిచేస్తోంది. మంకీ ఫీవర్ కారణంగా తాజాగా కర్ణాటకలో ఇద్దరు మరణించారు. శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన యువతి (18), ఉడుపి జిల్లా మణిపాల్ కు చెందిన వృద్ధుడు (79) మంకీ ఫీవర్ తో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో 3 మంకీఫీవర్ కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ రణ్ దీప్ ఆదివారం వెల్లడించారు. శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను.. వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా.. అందులో 48 మందికి మంకీ ఫీవర్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కోతుల్ని కరిచే కీటకాలు.. మళ్లీ మనిషిని కుట్టినపుడు ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు వివరించారు.
మంకీఫీవర్ సోకిన వారికి తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటివి కనిపిస్తాయని చెప్పారు. మంకీఫీవర్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఎవరికైనా జ్వరం వస్తే.. దానిని తేలికగా తీసుకోరాదని, వెంటనే పరీక్షలు చేయించుకుంటే ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని సూచించారు.
1957లో కర్ణాటకలోని క్యాసనూర్ ఫారెస్ట్ లో మంకీఫీవర్ కలకలం రేగింది. 2012 నుంచి కర్ణాటక సహా.. దేశమంతా మంకీఫీవర్ వ్యాప్తి మొదలైంది. ప్రతిఏటా సుమారు 500 మంది మంకీఫీవర్ బారిన పడుతుండగా.. 5-10 శాతం మందికి ఫారెస్ట్ ఏరియా నుంచే ఫీవర్ వ్యాపిస్తోంది.