రకరకాల కారణాలతో పలు దేశాలు ప్రముఖ సోషల్ మీడియా సైట్లపై బ్యాన్ విధిస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశాల సరసన నేపాల్ చేరింది. ఇచ్చిన గడువులోపు కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఆయా సంస్థలు నమోదు చేసుకోని కారణంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని నిర్ణయించినట్లు నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిషేధం గురువారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
కమ్యూనికేషన్స్, ఐటి మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల వినియోగానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023 నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుగుణంగా లేని సోషల్ మీడియా యాప్ లను నిషేధించాలని నిర్ణయించారు. ఆదేశ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీసు ప్రకారం, రిజిస్ట్రేషన్ కోసం సోషల్ మీడియా కంపెనీలకు ఆగస్టు 28 నుంచి ఏడు రోజుల సమయం ఇవ్వబడింది. బుధవారం రాత్రి గడువు ముగిసినప్పటికీ, మెటా (ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్), ఆల్ఫాబెట్ (యూట్యూబ్), ఎక్స్, రెడ్డిట్, లింక్డ్ ఇన్ లాంటి పెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఏవీ దరఖాస్తులను సమర్పించలేదు.
అటు టిక్టాక్, వైబర్, విట్క్, నింబుజ్, పోపో లైవ్ లాంటి యాప్లు లిస్ట్ చేయబడ్డాయని, టెలిగ్రామ్, గ్లోబల్ డైరీ దరఖాస్తు చేసుకున్నాయని, అవి ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. జాబితా చేయబడిన ఐదు ప్లాట్ ఫారమ్ లు, ఈ ప్రక్రియలో ఉన్న రెండు మినహా, మిగతావన్నీ నేపాల్ లో బ్యాన్ చేయబడుతాయని నేపాల్ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గజేంద్ర కుమార్ ఠాకూర్ అన్నారు. ఏదైనా ప్లాట్ ఫారమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే, అదే రోజు తిరిగి ఓపెన్ అవుతుందన్నారు. అటు ఈ నిషేధంపై ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా కంపెనీలు నేపాల్ ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా ఎటువంటి కామెంట్స్ చేయలేదు.
నేపాల్ ప్రభుత్వ నిర్ణయం విదేశాలలో నివసిస్తున్న లక్షలాది మంది నేపాలీలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఆ దేశ ప్రజలు ప్రతిరోజూ కమ్యూనికేషన్ కోసం ఫేస్ బుక్ మెసెంజర్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఉపయోగిస్తారు. “ఉన్నత చదువుల కోసం, ఉపాధి కోసం ఏడు మిలియన్లకు పైగా యువత నేపాల్ బయట ఉంటున్నారు. ఈ నిర్ణయం వారి కుటుంబం, స్నేహితులతో కమ్యూనికేషన్ ను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది” అని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫేస్ బుక్ ఇటీవల నేపాల్ ను కంటెంట్ మోనటైజేషన్ కు అర్హత ఉన్న దేశాల జాబితాలో చేర్చినందున, వినియోగదారులు వీడియోలు, రీల్స్, స్టోరీస్ నుంచి నేరుగా డబ్బులు సంపాదించడానికి వీలు ఉండేది. కానీ, ఇప్పుడు బ్యాన్ విధించడంతో కంటెంట్ క్రియేటర్స్ మీద దెబ్బ పడే అవకాశం ఉంటుంది. అయితే, నిషేధానికి గురైన సోషల్ మీడియా సైట్లు వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుని, అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also: రూ. 329కే 1000 జీబీ డేటా, BSNL బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు ఇంత బాగున్నాయా?