Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నాటి S.I.B చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు A వన్ గా చేర్చారు. A2గా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, A3 గా మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు, A4 గా అడిషనల్ ఎస్పీ భుజంగరావు, A5 గా అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, A6 గా ఓ ప్రైవేట్ వ్యక్తి ఉన్నారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తంలో కీలక సూత్రధారి ప్రభాకర్ రావేననిజ.. అతని కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ పరికరాలను, హార్డ్ డిస్క్ లను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్టు విచారణలో తేలింది.
ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లు, డివైజ్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని రిట్రీవ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. హార్డ్ డిస్క్ లు రిట్రీవ్ అయితే కేసుకు సంబంధించి పూర్తి సమాచారం లభించనుంది.
ప్రణీత్ రావు కేసులో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు 14 రోజులు రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. వారిద్దరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఏప్రిల్ 6 వరకు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ లో ఉండనున్నారు. అదేవిధంగా కస్టడీ పూర్తయిన ప్రణీత్ రావును కూడా వారితో పాటు జైలుకు తరలిస్తున్నారు.
Also Read: ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. మరో ఇద్దరు ఏఎస్పీలు అరెస్ట్
ముగ్గురిని కలిపి విచారించడానికి సోమవారం మరోసారి పంజాగుట్ట పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు . మరోవైపు ప్రణీత్ రావు ఈనెల 27 వరకు రిమాండ్ లోనే ఉండనున్నారు. ముగ్గురిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు భుజంగరావు, తిరుపతన్న తరఫు లాయరు వారికి బెయిల్ మంజురు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ ను మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు. అటు పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావు కస్టడీ పొడిగించాలని కోరగా మెజిస్ట్రేట్ నిరాకరించారు. రేపు మరోసారి ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసుందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ముగ్గరిని కలిపి విచారిస్తే మరింత కీలక సమాచారం రాబట్టొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.