Restaurant Tax Evasion: గతేడాది నవంబర్ లో హైదరాబాద్ లోని కొన్ని రెస్టారెంట్లలో జరిపిన సాధారణ ఐటీ దాడుల్లో దేశవ్యాప్తంగా జరిగిన భారీ పన్ను ఎగవేత రాకెట్ బయటపడింది. 2019-20 నుంచి ఇప్పటివరకూ రూ.70,000 కోట్ల అమ్మకాలు రహస్యంగా దాచి పెట్టారని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ప్రముఖ పాన్ ఇండియా బిల్లింగ్ సాఫ్ట్ వేర్ ఫ్లాట్ ఫామ్ ను దుర్వినియోగం చేయడం ద్వారా రెస్టారెంట్లు తమ టర్నోవర్ ను ఆదాయపన్ను అధికారుల దృష్టిలోకి రాకుండా కప్పిఉంచాయని తేలింది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 133A కింద నిర్వహించిన ఈ దర్యాప్తులో.. 2019–20 నుంచి 2025–26 వరకు ఆరు ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన దాదాపు 60 టెరాబైట్ల లావాదేవీల డేటాను అధికారులు విశ్లేషించారు. ఈ సాఫ్ట్ వేర్ ను దేశవ్యాప్తంగా ఉన్న 1.77 లక్షల రెస్టారెంట్లు వాడుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇది దేశంలోని దాదాపు 10 శాతం రెస్టారెంట్లకు సమానమని పేర్కొన్నారు. గత ఆరేళ్లలో రూ.2.43 లక్షల కోట్ల విలువైన బిల్లింగ్ జరిగినట్లు తెలిపారు. 60 టెరాబైట్ల డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో పరిశీలించగా.. బిల్లింగ్ తర్వాత రూ.13,317 కోట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు వెల్లడైంది. ఇలా కొన్నేళ్లుగా దాదాపు రూ.70 వేల కోట్ల లావాదేవీలకు సంబంధించి పన్ను ఎగవేశారని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రెస్టారెంట్లు తమ వార్షిక టర్నోవర్ ను తక్కువగా చూపేందుకు బహుళ పద్దతులను అనుసరించినట్లు అధికారులు పేర్కొన్నారు. బ్యాంక్ కార్డు, యూపీఐ వంటి చెల్లింపులు అధికారికంగా జరుగుతాయి కాబట్టి వాటిని యథాతథంగా ఉంచి.. నగదు చెల్లింపుల్లో మాత్రం అవకతవకలు చేసినట్లు పేర్కొన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించిన రికార్డులను.. సాఫ్ట్ వేర్ నుంచి తీసేశారని.. కొన్ని రెస్టారెంట్లు అయితే కొన్ని రోజుల తరబడి నగదు చెల్లింపులు జరగలేదన్నట్లుగా చూపించాయని స్పష్టం చేశారు. తద్వారా లాభాలను దాచేసి.. నష్టాల్లో ఉన్నట్లుగా ఆదాయపన్ను శాఖ అధికారులను తప్పుదోవ పట్టించినట్లు తేలింది.
Also Read: Taliban Law: భార్యలను హింసించొచ్చు.. పిల్లల్ని సైతం వేధించొచ్చు.. అఫ్గాన్లో తాలిబన్ల కొత్త చట్టం!
రెస్టారెంట్ల పన్ను ఎగవేతను ప్రాథమికంగా ఐదు రాష్ట్రాల్లో గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ లోని రెస్టారెంట్లలో అవకతవకలు బయటపడ్డాయి. దాదాపు రూ.2,000 కోట్ల పన్ను ఎగవేతతో కర్ణాటక టాప్ లో ఉండగా.. తెలంగాణ రూ.1500 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే రెస్టారెంట్ల పన్ను ఎగవేతకు సంబంధించి తొలుత హైదరాబాద్ లో సోదాలు మెుదలయ్యాయి. ఆ తర్వాత ఏపీలోని విశాఖపట్నానికి చేరాయి. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించి.. అతి పెద్ద కుంభకోణాన్ని వెలికితీశాయి. ఇప్పటివరకూ బయటపడ్డ డేటా ఆధారంగా హోటల్స్, రెస్టారెంట్లలో జరిగే అమ్మకాల్లో 25 శాతం లెక్కల్లోకి రావడం లేదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని భవిష్యత్తులో విస్తుపోయే లెక్కలు బయటపడవచ్చని తెలుస్తోంది.
Also Read: Solar AC in India: సోలార్ ఏసీ వల్ల లాభాలేమిటీ? ఎంత ఖర్చవుతుంది? కరెంట్ బిల్లు తగ్గుతుందా!