Saraswati Pushkaralu: స్వేచ్ఛ బ్యూరో: సరస్వతీ అంత్య పుష్కరాలు ఈనెల 21 నుంచి ప్రారంభమవుతుందని, దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశామని, భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సరస్వతీ అంత్య పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈనెల 21న ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠం స్వామి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ పుణ్య స్నానం ఆచరించి సరస్వతీ అంత్య పుష్కరాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. కాళేశ్వరం ఆలయంలో దర్శనాలు, పుష్కర స్నానాలకు వచ్చే వివిధ పీఠాధిపతులకు తగిన ఏర్పాట్లు, పుష్కర ఘాట్ ల వద్ద పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మేడారం జాతర స్పూర్తితో సరస్వతి అంత్య పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతీ రోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజి ఈ పుష్కారాల్లో పాల్గొని పుణ్య స్నానం చేస్తారని, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంత్య పుష్కరాల అనుభవాలు రానున్న గోదావరి పుష్కరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కె. రామకృష్ణా రావు మాట్లాడుతూ..
సీఎస్ కె. రామకృష్ణా రావు మాట్లాడుతూ ఈ అంత్య పుష్కరాలకు విస్తృతమైన మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేసినందున పెద్ద సంఖ్యలో యాత్రికులు హాజరయ్యే అవకాశముందని, శానిటేషన్, ట్రాఫిక్, ప్రోటోకాల్, రవాణా, తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ దేవా దాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, 2012 లో జరిగిన సరస్వతి పుష్కరాలకు కేవలం 2 లక్షల మంది మాత్రమే హాజరవగా, గత సంవత్సరం జరిగిన ఆది పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది హాజరయ్యారని వెల్లడించారు. మొదటి రోజు కంచి స్వామిజీతోపాటు రాష్ట్ర గవర్నర్ గారు కూడా పుణ్య స్నాలకు హాజరవుతారన్నారు.
హనుమంత రావు మాట్లాడుతూ..
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు మాట్లాడుతూ అతిథి గృహాలు, 100 గదుల చౌల్ట్రీ, ఘాట్ వద్ద టెంట్ హౌస్ ల ఏర్పాటు, ప్రముఖులకు ఆహ్వానాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాట్లకు రెవెన్యూ శాఖ సమన్వయం చేపడుతోందన్నారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామ చంద్రన్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి, ఐ.జి చంద్ర శేఖర్ రెడ్డి , జెన్ కో ఎండి హరీష్, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
Also Read: థాయ్లాండ్లో ఘోర ప్రమాదం.. గూడ్స్ రైలు-బస్సు ఢీకొని 8 మంది మృతి, మరో 20 మందికి గాయాలు
మే 21 నుండి సరస్వతీ నది అంత్య పుష్కరాలు
తెలంగాణలోని కాళేశ్వరం వేదికగా మే 21 నుండి జూన్ 1 వరకు సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పుష్కరాలకు సుమారు 40 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు… pic.twitter.com/27ix2IvETy
— ChotaNews App (@ChotaNewsApp) May 16, 2026