అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. నదీ జలాలు, రాష్ట్ర అభివృద్ధి మీద సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రసంగం చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. నదీ జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని విరుచుకపడ్డారు. అయితే, సీఎం వ్యాఖ్యల మీద కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చిన మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే మీద మరోసారి ఫైర్ అయ్యారు. తను పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె హరీశ్ రావు మీద బహిరంగంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. కానీ అది ఇంతవరకూ ఆమోదం పొందలేదు. ఈ క్రమంలోనే ఆమె చివరి సారిగా తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరినట్టు తెలిసింది. ముందుగా చైర్మన్ను కలిసిన ఆమె రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద చిట్ చాట్ చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు ద్రోహం చేసిన కేసీఆర్ను ఉరితీయాలని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఉద్యమనేత, ప్రత్యేక తెలంగాణ సాధించిన వ్యక్తిని అలా అంటారా? అని ఫైర్ అయ్యారు.
ప్రభుత్వం కేసీఆర్ మీద వేస్తున్న అబాండాలను తిప్పికొట్టాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆమె కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పిల్లకాకుల మీద భారం వేస్తే ఎలా? అని పరోక్షంగా హరీశ్ రావును ఉద్దేశించి విమర్శించారు.హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదని.. బబూల్ షూటర్ అని సెటైర్లు వేశారు. పాలమూరుకు ద్రోహం చేసిన వ్యక్తికి అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అవకాశం ఎలా ఇస్తారని ఏకంగా తన తండ్రి కేసీఆర్ను కవిత తప్పుబట్టారు. నదీ జలాల అంశంలో క్లారిటీ రావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అసలు విషయాన్ని వివరించాలని కోరారు. హరీశ్ వల్లే కేసీఆర్కు చెడ్డ పేరు వస్తుందని ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు కేసీఆర్ను పొగుడుతూ మరోవైపు హరీశ్ రావు, కేటీఆర్ లను కార్నర్ చేస్తున్న కవిత.. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టా? లేక అందులోనే ఉండి రాజకీయాలు చేస్తున్నారా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ వస్తేనే బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఆమె పంచాయితీ హరీశ్, కేటీఆర్తో అయినప్పుడు బయటకు రావాల్సిన అవసరం ఏంటని, పార్టీలోనే నుంచి కొట్లాడవచ్చు కదా? అని నిలదీస్తున్నారు. మరోవైపు జాగృతి పార్టీ భవిష్యత్లో బలపడితే బీఆర్ఎస్కు కష్టమని వ్యాఖ్యానించడంపైనా అటు గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. కవిత అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారని అందుకే మొన్నటివరకు ఏ పార్టీలో ఉండి పదవులు అనుభవించారో దానిపైనే నిందలు వేస్తున్నారని మండిపడుతున్నారు.