
Telangana Unemployment : తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందున్నది యువకులు. అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది కీలక పాత్ర. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవంటూ కదం తొక్కారు. స్వరాష్ట్రం వస్తేనే నియామకాలు జరుగుతాయని బలంగా విశ్వసించారు. వందలాది మంది రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేశారు. మరి వాళ్ల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాయా? తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతున్నా యువతకి ఒరిగిందేంటి? పదేళ్ల గులాబీ పాలనలో ఉద్యోగాల ఊసేఎత్తకుండా.. ఎన్నికల ఏడాది చివర్లో చేసిన హడావుడి TSPSC లీకేజీ వ్యవహారంతో అభాసు పాలైంది. నిరుద్యోగ యువకుల ఆశలు అడియాసలయ్యాయి. కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు కోచింగ్ సెంటర్లలో అప్పులు చేసి చేరి.. ఇప్పుడు కూలీలుగా మారుతున్నారు. ఈ వ్యవహారాలన్నింటిని ప్రశ్నిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది.
పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలన తీరును ప్రశ్నిస్తూ యూత్ కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేసింది. అందులో అనేక అంశాలను లెక్కలతో సహా పొందుపరిచింది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎంతో చేశామని చెబుతున్న కేసీఆర్ సర్కార్ను ఛార్జ్షీట్లో గట్టిగా నిలదీస్తూ వాస్తవాలు కళ్లకు కట్టింది. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే విద్యా రంగానికి అతి తక్కువ మొత్తంలో నిధులు వెచ్చించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని యూత్ కాంగ్రెస్ మండిపడింది. 2014-15లో రాష్ట్ర బడ్జెట్లో 10.89 శాతం విద్యారంగానికి కేటాయించగా… 2015-16లో ఇది 9.68 శాతానికి తగ్గింది. ఆ తరువాత 2016-17లో 8.23శాతానికి, చివరికి 2023-24 నాటికి కేవలం 7.6శాతానికే పరిమితమైంది.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో కేజీ టు పీజీ ఉచిత విద్యను ప్రకటించిన కేసీఆర్.. 9 ఏళ్లలో తెలంగాణలో కొత్తగా ఒక్క తరగతి గదిని కూడా నిర్మించలేకపోయారు. గంభీరావు పేటలో కేవలం ఒక సంస్థను మాత్రమే నిర్మించారు. అది కూడా CSR నిధులతో పూర్తి చేశారు. CSR నిధుల కింద పాఠశాలిని నిర్మించమని కార్పొరేట్ కంపెనీలని అడుక్కునే స్థితికి తెలంగాణ ప్రభుత్వం దిగజారిందని యూత్ కాంగ్రెస్ ఛార్జ్షీట్లో నిలదీసింది.
ప్రతి ఇంటికి ఉద్యోగం అంటూ యువతకు కేసీఆర్ అబద్ధాలు చెప్పారని ఛార్జ్షీట్లో ప్రస్తావించారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వ శాఖల్లో దాదాపు 40 శాతం అంటే 12 లక్షల పోస్టుల ఖాళీలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎండగట్టారు. కేవలం 60 శాతం ఉద్యోగులతో నడుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అక్షరాల 60శాతం సర్కార్ అని యూత్ కాంగ్రెస్ మండిపడింది. వరుస వైఫల్యాల తర్వాత కూడా బీఆర్ఎస్ అదే TSPSC బోర్డును కొనసాగించడం దుర్మార్గమంది. పేపర్ లీకేజీలపై దర్యాప్తును ఆలస్యం చేయడం ద్వారా TSPSC పరీక్షలు రాసే లక్షలాది మంది అభ్యర్థుల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయింది.
పదో తరగతి నుంచి TSPSC వరకు అన్ని పరీక్షల నిర్వహణలో BRS ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ అసమర్ధత వల్ల 2014 నుంచి 2021 మధ్య దాదాపు 3వేల600 మందికి పైగా యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల ఒకే సమయంలో వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా లక్షలాది మంది ఆశావహులు గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-2 వాయిదా కోరుతూ నిరసన తెలిపిన 4 వేల మంది యువకులపై కేసీఆర్ లాఠీచార్జి చేయించారని యూత్ కాంగ్రెస్ ఛార్జ్షీట్లో నిలదీసింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచిన అంశాలను యూత్ కాంగ్రెస్ ప్రస్తావించింది. 2012, 2013లో ఎలాంటి వివాదాలు లేకుండా 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపింది. ఇదే సమయంలో వివాదాలు, అవినీతి లేకుండా కనీసం ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేక BRS పరిపాలన పూర్తిగా విఫలమైందని ఫైరైంది. 2018 ఎన్నికల సమయంలో 3,016 రూపాయల నిరుద్యోగ భృతి హామీగా ప్రకటించన BRS.. దాన్ని నెరవేర్చలేదు. ఇప్పటి వరకు ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ సర్కార్ లక్షా 74 వేల928 బాకీ పడిందని లెక్కలతో సహా ఛార్జ్షీట్లో తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. 4వేల592 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపులో జాప్యం కారణంగా కళాశాల నిర్వాహకులు విద్యార్థులకు సర్టిఫికేట్లు, టీసీలను తిరస్కరిస్తున్నారని ఛార్జ్షీట్లో యూత్ కాంగ్రెస్ ఎండగట్టింది. ప్రభుత్వ యూనివర్సిటీల్లో 2/3 వంతు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని… కనీస వసతులు లేక విద్యార్థులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన సన్నిహితులకు లబ్ది చేకూర్చేందుకు కేసీఆర్… ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ.. ప్రభుత్వ యూనివర్శిటీలను నాశనం చేస్తున్నారు. కేసీఆర్ అసమర్థత పాలన వల్ల యువత మద్యానికి, జూదానికి, డ్రగ్స్కి బానిసలై భవిష్యత్తు అంధకారమవుతోందని ఛార్జ్షీట్లో యూత్ కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసింది.
తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ తమను నిండా ముంచారంటూ చేపట్టిన నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. బిస్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చినా వాటిని ఎందుకు భర్తీ చేయలేడందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. TSPSC లీకేజీలతో అవస్థలు పడ్డామని.. కేసీఆర్ పాలన పోతేనే ఉద్యోగాలు వస్తాయంటున్నారు. ఇదే విషయాన్ని యువతకు వివరించేందుకే నిరుద్యోగ చైతన్య బస్సుయాత్ర చేపట్టామని చెబుతున్నారు.
రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు.. వాళ్ల కుటంబాలు అవస్థలు పడుతున్నాయని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి 5 వేల పోస్టులకే పరిమితం చేశారని ప్రశ్నిస్తున్నారు. గ్రూప్-1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ లీకేజీ సహా బయోమెట్రిక్ నమోదు చేయకుండా మరోసారి రద్దయ్యేందుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడుతున్నారు. 119 నియోజకవర్గాల్లో బస్సుయాత్రతో నిరుద్యోగులని చైతన్య పరుస్తామన్నారు. ఎన్నికల్లో యువత పవర్ ఏంటో చూపిస్తామని.. నిరుద్యోగ చైతన్య బస్సుయాత్ర ప్రతినిధులు హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనతో తమ బతుకులు మారుతాయని లక్షలాది మంది యువకులు భావించారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలతో కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఆశించారు. చివరకు రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతుల్లో బంధీ అయిందని ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ని గద్దె దింపితేనే రాష్ట్రంలో యువతకి మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.