Telugu States Ministers Portfolios: కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆదివారం సాయంత్ర ప్రధాని మోదీ, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈ సాయంత్రం కేబినెట్ భేటీ జరిగింది. ఆ తరువాత మంత్రులకు శాఖలు అప్పగించారు.
మోదీ ప్రభుత్వం గత పాలనలో మంత్రులుగా ఉన్న వారికే ఆ శాఖలను కట్టబెట్టింది. కీలకమైన హోం శాఖ మంత్రిగా అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్లు ఉండనున్నారు. కాగా గత ప్రభుత్వంలో కూడా వారు ఇవే శాఖలకు అధిపతులుగా పనిచేయడం గమనార్హం.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు చోటు దక్కించుకోగా.. ఏపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మలు చోటు దక్కించుకున్నారు. ఇందులో కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడులకు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఇక బండి సంజయ్, పెమ్మసాని, శ్రీనివాసవర్మలకు సహాయ మంత్రులు దక్కాయి.
బండి సంజయ్, కిషన్ రెడ్డి, శ్రీనివాసవర్మలు బీజేపీ తరఫున మంత్రి పదవులు దక్కించుకోగా.. రామ్మోహన్ నాయుడు,. పెమ్మసాని చంద్రశేఖర్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఏన్డీయే కూటమిలో భాగంగా మంత్రి పదవులు ఒడిసిపట్టుకున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండిసంజయ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు.
Also Read: మంత్రులకు శాఖలు కేటాయింపు.
ఇక ఏపీలోని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం నుంచి శ్రీనివాసవర్మ లోక్ సభ బరిలో నిలిచి గెలిచారు.