ఏపీలో కల్తీ నెయ్యి అంశం నేటికీ పొలిటికల్ హీట్ పెంచుతోంది.2019 ఎన్నికల ముందు తెరపైకి వచ్చిన ఈ అంశంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసిందని తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ సైతం దుమ్మెత్తిపోస్తున్నది. వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేయడానికి మీరు అసలు మనుషులేనా? అని పెద్దఎత్తున కాషాయపార్టీ విరుచుకపడిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసిందని విమర్శలు గుప్పించింది. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో సీబీఐ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ అంశం కాస్త తెలంగాణ రాజకీయాలకు పాకింది.
తిరుమలకు పంపించే నెయ్యిలో గత ప్రభుత్వ హయాంలో జంతు అవశేషాలు, కెమికల్స్తో తయారైన నెయ్యిని సరఫరా చేశారని తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రధానంగా ఊటకించారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు సైతం ఎన్నికలకు ముందు నుంచి ఈ విషయంలో అగ్రెసివ్గా ఉన్నారు. జగన్ తప్పు చేశారని.. అందుకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పలుమార్లు హెచ్చరించారు. తీరా గత ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయాక.. వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని, అందుకు ఇదో ఉదాహరణ అని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణ దేవాదాయ శాఖలోనూ కల్తీ నెయ్యి వాడుతున్నారని ప్రచారం జరిగింది.
ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఎటూ తేలకముందే తెలంగాణలో కల్తీ నెయ్యి వాడుతున్నట్టు ప్రచారం జరగడంపై సీఎం రేవంత్ నిన్న స్పందించారు.రాష్ట్రంలో ఎటువంటి కల్తీ నెయ్యి వినియోగించడం లేదని.. తెలంగాణలోని దేవాలయాలకు విజయ నెయ్యి వినియోగిస్తున్నట్టు ప్రకటించారు. విజయ డెయిరీ ప్రభుత్వం అనుబంధ సంస్థ కావడంతో ఇక్కడ కల్తీకి తావులేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ సమాధానంతో రాష్ట్రంలో కల్తీ నెయ్యి ప్రచారానికి తెరపడినట్టు తెలుస్తున్నది. కొందరు కావాలనే మున్సిపల్ ఎన్నికల సమయంలో కల్తీ నెయ్యి అంశాన్ని లేవనెత్తారని సైతం ప్రచారం జరుగుతోంది. సీఎం ముందుగా స్పందించడంతో ఇకమీదట మరోసారి ఇటువంటి ప్రచారం రాష్ట్రంలో జరగబోదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఇదిలాఉండగా, ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. సిట్ ఏమో కల్తీ జరిగిందని చెబుతుంటే..సీబీఐ కల్తీ జరగలేదని చెప్పిందని.. అంటే తమ ప్రభుత్వహయాంలో ఎటువంటి తప్పు జరగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.కావాలనే కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అయితే, నిన్న మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ బదులిస్తూ.. కల్తీ నెయ్యి అంశం ఏపీకి చెందినదని.. తమకు ఏం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కల్తీ నెయ్యి అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.