Kavitha Demands: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సమయం దగ్గరపడుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) కీలక సూచనలు చేశారు. హామీలను అమలు చేసే అవకాశం కాంగ్రెస్ వచ్చిందంటూ.. పలు డిమాండ్లను ముఖ్యమంత్రి ఎదుట ఉంచారు. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం గురించి కూడా ఆమె మాట్లాడారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి.. పరస్పర ఆరోపణలకే పార్టీలు, నేతలు పరిమితం అయ్యారని విమర్శించారు. పట్టణ ప్రజలు మంచి వాళ్లను ఎన్నుకోవాలని సూచించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB), తెలంగాణ జాగృతి మధ్య వ్యూహాత్మక పొత్తు కుదిరిన నేపథ్యంలో అవకాశం ఉన్న దగ్గర సింహం గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని కవిత కోరారు.
ఫిబ్రవరి 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Budget Session) జరగనున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి ఎదుట కవిత కొన్ని డిమాండ్లు ఉంచారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇస్తామన్న రూ.20,000 కోట్ల హామీని వెంటనే అమలు చేయాలన్నారు. 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు రూ.25,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించాలని సూచించారు. అలాగే అమరవీరుల కుటుంబాలకు రూ.25,000 పెన్షన్, ఆటో డ్రైవర్లకు రూ.12,000 అందజేయాలన్నారు. అంతేకాకుండా తెలంగాణ కళాకారులను గుర్తించి.. బడ్జెట్ లో వారికంటూ కొంత నిధులు కేటాయించాలని పట్టుబట్టారు.
మరోవైపు వరంగల్ లో రైతు డిక్లరేషన్ అమలు కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. ‘రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు.. ఈ బడ్జెట్ లో పెట్టాలి. తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతు రుణమాఫీ 100 శాతం చేశామని సీఎం రేవంత్ రెడ్డి సభలలో చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కి సవాల్ చేస్తున్నాం. రుణ మాఫీ 50 శాతం రైతులకు కూడా చేయలేదు. సీఎం కు చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 50 శాతం రైతులకు రుణమాఫీ చేయాలి. విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ రూ.11 వేల కోట్లు వెంటనే మంజూరు చేయాలి’ అని కవిత పట్టుబట్టారు.
ఆర్టీసీ కార్మికులు సమస్యల గురించి కూడా కవిత మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ కలిసి ఆర్టీసీ కార్మికుల బలవంతంగా తొలగించారని ఆరోపించారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ఆర్టీసీ విలీనం ప్రక్రియను బడ్జెట్ లో పెట్టాలని పట్టుబట్టారు. బడ్జెట్ లో మహిళలకు 2500 స్కూటీలు ఇవ్వాలని కవిత పేర్కొన్నారు. తెలంగాణ యువతకు అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. ఈ బడ్జెట్ లో 1,80,900 ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబట్టారు.
Also Read: YS Jagan: అసెంబ్లీకి జగన్.. తిరుమల కల్తీ నెయ్యిపై స్పందిస్తారా? సంతకం చేసి వెళ్తారా?
అసదుద్దీన్ ఒవైసీ సోదరుల గురించి మాట్లాడుతూ కవిత తీవ్ర విమర్శలు చేశారు. ‘ఒవైసీ బ్రదర్స్ సన్ ఫ్లవర్ లాంటి వారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అటు తిరుగుతారు. ఎంఐఎం పార్టీ వారు రెండేళ్లుగా కాంగ్రెస్ తో ఉంటున్నారు. ఓల్డ్ సిటీని ఏమైనా అభివృద్ధి చేసారా? ఒవైసీ బ్రదర్స్ కూడా పాత బస్తీలో ఉండటం లేదు కదా. మైనారిటీల కోసం కేటాయించిన బడ్జెట్ ను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా ఖర్చు చేయలేదు’ అంటూ కవిత మండిపడ్డారు.
Also Read: Hydra operation: హైడ్రా మెరుపు దాడి: రూ. 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కోరల నుంచి విముక్తి