TIMS Hospital: సనత్నగర్ టిమ్స్ (TIMS) ఆసుపత్రి అకడమిక్ బ్లాక్లో చోటుచేసుకున్న భారీ చోరీ స్థానికంగా పెద్ద కలకలాన్నే రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు పక్కా పథకం ప్రకారమే వచ్చి.. ఏకంగా లక్షల విలువైన పరికరాలను క్షణాల్లో మాయం చేసేశారు.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్లోని సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి అకడమిక్ బ్లాక్ ఐదో అంతస్తులో ఉన్న స్టోరేజ్ రూమ్ను దుండగులు టార్గెట్ చేశారు. గది తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు, అక్కడ భద్రపరిచిన ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన విలువైన ఐఓఎస్ పరికరాలను ఎత్తుకెళ్లారు. మొత్తం 12 ఐఓఎస్ బాక్సులను దొంగిలించగా, ఒక్కో బాక్సులో 24 చొప్పున ఏకంగా 288 ఐఓఎస్ పరికరాలు చోరీకి గురయ్యాయి.
వెలుగులోకి వచ్చిందిలా..
ఈ నెల 13న ఉదయం 7.30 నుంచి 8 గంటల మధ్య ఈ చోరీ జరిగినట్లు ఆసుపత్రి వర్గాలు గుర్తించాయి. చోరీ తీవ్రతను గ్రహించిన సైట్ ఇంజనీర్ ఎన్. నాగ సాయివంశీ కృష్ణ వెంటనే అలర్ట్ అయ్యి బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు
బాధితుడి ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సెక్యూరిటీ కంటకంలో ఉన్న ఐదో అంతస్తు వరకు దొంగలు ఎలా వెళ్లారనే దానిపై నిఘా పెట్టారు. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ.. ఈ దొంగతనంలో తెలిసిన వారి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read: ఖైరతాబాద్లో బిగ్ ట్విస్ట్.. దానంకు ఊహించని ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్!