Chamala Kiran Reddy: భూ వివాదాల మంటల నడుమ భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి అజీజ్ నగర్ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నాయకుల ఆస్తులపై, విధానాలపై విరుచుకుపడ్డారు.
సిద్దిపేట నుంచి అజీజ్ నగర్ దాకా అక్రమాలు
హరీశ్ రావు మామ భూముల వివరాలు బయటపెట్టేందుకే మేము సిద్దిపేట వెళ్లాం. అక్కడ రంగనాయక సాగర్ పరిధిలో ఫార్మ్హౌస్ పేరిట, లావోని పట్టా భూములను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసుకున్నారు. నేడు అజీజ్ నగర్ వచ్చాం. ఉద్యమ కాలంలో ఎందరో యోధులు ఆస్తులు పోగొట్టుకుంటే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఊహించని రీతిలో కోట్లు కూడబెట్టారు. జన్వాడలో, అజీజ్ నగర్లో జీవో 111 నిబంధనలను బొందపెట్టి అక్రమ నిర్మాణాలు చేపట్టారు.
కేసీఆర్ ఫార్మ్హౌస్ వద్ద అసైన్డ్ భూములు
కేసీఆర్ ఫార్మ్హౌస్ వద్ద దాదాపు 300 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. గడిచిన పదేళ్ల పాలనలో దళితులకు ఈ పట్టాలను ఎందుకు ఇవ్వలేదు? పేదలకు భూములు ఇవ్వకుండా అడ్డుపెట్టుకుని, తమ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనేదే వారి కుట్ర. ఎన్నికల అఫిడవిట్లలో ఈ భారీ ఆస్తుల వివరాలు ఎందుకు దాచారో చెప్పాలి. అసలు ఉద్యోగం, వ్యాపారం లేనివారికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి?
ప్రజాక్షేత్రంలోనే నిజాలు తేలుస్తాం
శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఆన్ రికార్డ్ చెప్పిన విషయాలనే మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. 1600 మంది అమరుల బలిదానాల పునాదులపై సంపాదించిన ఈ ఆస్తులపై, కాళేశ్వరం అవినీతిపై సమాధానం చెప్ప తీరాలి. కేసీఆర్ దగ్గరి బంధువైన రమ్యా రావు కూడా వారి నాన్న ఆస్తులను కేసీఆరే లాక్కున్నారని బహిరంగంగా చెప్పారు. బీఆర్ఎస్ నేతల దోపిడీని, నయా నిజాంల నిజ స్వరూపాన్ని తెలంగాణ ప్రజల ముందు పూర్తి ఆధారాలతో నిలబెడతాం.
Also Read: సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిలో భారీ చోరీ.. విలువైన ఐఓఎస్ పరికరాలు మాయం!