Karimnagar ATM: కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజామున చోటుచేసుకున్న వరుస ఏటీఎమ్ దొంగతనాలు తీవ్ర కలకలం రేపాయి. వినాయక నవరాత్రుల వేళ జనాలు నిద్రపోయే సమయాన్ని ఆసరాగా చేసుకుని, పక్కా వ్యూహంతో దొంగల ముఠా ఈ దోపిడీలకు తెగబడింది.
నిమిషాల వ్యవధిలో పక్కా ప్లాన్
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడు వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎమ్లో తెల్లవారుజామున 3.35 గంటల సమయంలో దొంగలు హల్చల్ చేశారు. స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు లోపలికి వెళ్లడమే ఆలస్యం.. మొదట సీసీ కెమెరాలపై స్ప్రే చల్లారు. ఆ వెంటనే సైరన్ అలారం, కెమెరా కేబుళ్లను కత్తిరించారు. గ్యాస్ కట్టర్ల సాయంతో ఏటీఎమ్ మిషన్ను కట్ చేసి, క్షణాల్లో నగదుతో పరారయ్యారు. ఈ దురాగతమంతా కేవలం 8 నిమిషాల్లోనే పూర్తి చేయడం గమనార్హం.
పోలీసులు వచ్చేలోపే మాయం
ఏటీఎమ్ వద్ద అనుమానాస్పద కదలికలు గుర్తించి ఢిల్లీలోని సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వార్త తెలిసిన 10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ముఠా నగదుతో జారుకుంది.
Also Read: ఐఎస్ సదన్ పరిధిలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడి దుర్మరణం
తిమ్మాపూర్లోనూ అదే తరహా దోపిడీ
ఇదే సమయంలో ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ ఎస్బీఐ ఏటీఎమ్లోనూ దాదాపు ఇదే రీతిలో చోరీ జరిగింది. నవరాత్రుల కారణంగా అర్థరాత్రి వరకు రద్దీగా ఉండే వీధులు, తెల్లవారుజామున నిర్మానుష్యంగా మారడాన్ని ముఠా ముందే పసిగట్టింది. ఈ రెండు చోట్లా దోపిడీకి పాల్పడింది ఒకే గ్యాంగా, లేక వేర్వేరు బృందాలు పనిచేశాయా అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.