Kavitha: ఎందుకోగానీ కవిత ఈమధ్య ఫుల్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్పై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ జంతర్మంతర్ దగ్గరే దీక్షకు సిద్ధమయ్యారు. దీక్ష వరకూ ఓకే.. అందుకు ఎంచుకున్న పాయింటే వీక్గా ఉందని అంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాలుగా నానుతోంది. కవిత దీక్ష చేయడం వల్ల ఇప్పటికిప్పుడు బిల్లు పాసై పోతుందనే నమ్మకమైతే లేదంటున్నారు. ఏదో ఢిల్లీలో దీక్ష చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టే.. ఏదో ఒక అంశం తీసుకోవాలని.. మహిళా బిల్లును నెత్తికి ఎత్తుకున్నారని అంటున్నారు.
ఇక, దీక్ష పేరుతో ఢిల్లీలో బలప్రదర్శనకు రెడీ అవుతున్నారు కవిత. పేరుకు భారత్ జాగృతి పైకి కనిపిస్తున్నా.. ఏర్పాట్లన్నీ బీఆర్ఎసే చూస్తోంది. తెలంగాణ నుంచి వందలాది మంది సభ్యులను రైళ్లు, విమానాల్లో హస్తినకు చేరవేస్తున్నారు. దీక్షలో జనం బాగా కనబడేలా చూస్తున్నారు.
మహిళా బిల్లుపై కవిత చేస్తున్న దీక్షకు సుమారు 16 బీజేపీయేతర పార్టీల మద్దతు ఉందని చెబుతున్నారు. ఏయే పార్టీలకు చెందిన, ఎవరెవరు నేతలు దీక్షకు హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆకాళీదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సిపిఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీలు కవిత దీక్షకు సపోర్ట్ తెలిపాయి. ఆయా పార్టీల నేతలు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, మహిళా బిల్లుపై మక్కువతో ఉన్నా.. లిక్కర్ స్కామ్లో చిక్కుకున్న కవిత చేస్తున్న దీక్షకు వస్తారా? లేదా? అనేది ఆసక్తికరం.
శుక్రవారం దీక్ష అయితే.. శనివారం ఈడీ విచారణ. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన విషయం. దీక్షను ఎలాగోలా సక్సెస్ చేసేస్తారు. మరి, ఈడీ ఎంక్వైరీని ఎలా ఫేస్ చేస్తారు? ప్రచారం జరుగుతున్నట్టుగా కవితను అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఇందుకోసమూ బీఆర్ఎస్ ఓ యాక్షన్ ప్లాన్ని రెడీ చేసిందని అంటున్నారు. కవిత దీక్ష కోసం తెలంగాణ నుంచి తరలివెళ్లిన జాగృతి కార్యకర్తలు, కవిత అభిమానులను శనివారం వరకూ హస్తినలోనే ఉంచుతారని తెలుస్తోంది. ఒకవేళ ఈడీ కనుక కవితను అరెస్ట్ చేస్తే.. వెంటనే దేశ రాజధానిలో ఆందోళనలు, నిరసనలు చేసేలా ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చినట్టు సమాచారం. కవితను నిజంగానే అరెస్ట్ చేస్తే.. ఆమె ఇప్పట్లో మళ్లీ తెలంగాణకు తిరిగొచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు. ప్రస్తుత ఢిల్లీ పర్యటన కవితకు ఎంతో కీలకం. అందుకే, ఏం జరుగుతుందోననే టెన్షన్.