Andalamma Temple: తెలంగాణలో చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటిలో పెద్దపల్లి జిల్లాలోని ఆండాలమ్మ ఆలయం ప్రత్యేకమైనది. సాధారణంగా దేవాలయాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. కానీ, ఈ ఆలయం మాత్రం పురాతన నిర్మాణం, చుట్టూ ఉన్న కొండలు, ప్రశాంతమైన వాతావరణంతో పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం జానపద పాటలు, షార్ట్ ఫిల్మ్స్, ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కు ఈ ప్రదేశం కేరాఫ్ అడ్రస్ గా మారింది.
ధర్మాబాద్-ముత్తారం ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం పెద్దపల్లి పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండల మధ్య ఆలయం ఉండటంతో ఇక్కడి వాతావరణం మిగతా ప్రాంతాలకు భిన్నంగా కనిపిస్తుంది. రద్దీకి దూరంగా ఉండటంతో ప్రశాంతంగా కొంత సమయం గడపాలనుకునేవారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. స్థానికులు పుట్టినరోజులు, చిన్నపాటి వేడుకలు, కుటుంబ విహారాలకు ఆలయ పరిసరాలను ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు ఫొటోగ్రాఫర్లు, కొరియోగ్రాఫర్లు, వీడియో బృందాలు తమ షూటింగ్స్ కోసం ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాయి.
ఆండాలమ్మ ఆలయానికి సోషల్ మీడియాలో, ఎంటర్ టైన్ మెంట్ రంగంలో కూడా గుర్తింపు రావడానికి షూటింగ్స్ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ జానపద గీతం ‘సారంగదరియా’లోని కొన్ని దృశ్యాలను ఈ ఆలయ ప్రాంగణంలో చిత్రీకరించారు. అలాగే ‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు కూడా ఈ ప్రాంతంలోనే షూట్ చేశారు. ఆలయ నిర్మాణం, కొండల నేపథ్యం కెమెరాలో ప్రత్యేకంగా కనిపించడంతో షూటింగ్ బృందాలకు ఇది బెస్ట్ స్పాట్ గా మారింది.
స్థానికుల కథనం ప్రకారం ఈ ఆలయానికి దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ముత్తారం, ధర్మాబాద్, కనగర్తి, కసులపల్లి తదితర ప్రాంతాలను పాలించిన స్థానిక జమీందారు ఎరబతి నరసింగరావు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. గ్రామంలో అప్పటికే రంగనాథ స్వామి ఆలయం ఉండటంతో ఆండాలమ్మ కోసం ప్రత్యేకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారని స్థానికుల విశ్వాసం. ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటం కూడా దీని ప్రత్యేకతల్లో ఒకటిగా చెబుతారు.
ఈ ఆలయంలో ప్రస్తుతం ప్రధాన విగ్రహం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. దీనికి సంబంధించి స్థానికంగా రెండు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ జరగకముందే జమీందారు మరణించడంతో ఆ కార్యక్రమం నిలిచిపోయిందని కొందరు చెబుతారు. మరికొంరు, గుప్త నిధుల కోసం వెతికిన వ్యక్తులు గర్భగుడిని తవ్వి ఆలయంలోని విగ్రహాన్ని తొలగించారని చెబుతారు. అయితే ఈ కథనాలకు స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది.
బయటి నుంచి చూసినప్పుడు ఆలయం ఆకట్టుకునేలా కనిపిస్తున్నప్పటికీ లోపలి భాగం మాత్రం కాలక్రమేణా దెబ్బతింది. గతంలో మండపంలో అందమైన గాజు పలకలు ఉండేవని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. కాలంతో పాటు అవి ధ్వంసమయ్యాయి. మండపం పైకప్పు, నేల కూడా మరమ్మతులు అవసరమైన స్థితికి చేరుకున్నాయి. అయితే ఆలయ పరిసరాల్లో ‘పల్లె ప్రకృతి వనం’లో భాగంగా పూల మొక్కలు పెంచడంతో ప్రాంగణం మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయ, పురావస్తు శాఖల పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వ పరిరక్షణ, అభివృద్ధి పనులు పెద్దగా జరగడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.