Lower Berth Rules: తక్కువ ఖర్చులో సౌకర్యవంతమైన సుదూర ప్రయాణాలు చేయాలనుకునే ఆళ్లు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే, గర్భిణీ స్త్రీలకు మాత్రం ఎక్కువసేపు కూర్చోవడం, పై బెర్త్ ఎక్కడం లాంటి విషయాలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్లీపర్ లేదంటే ఏసీ కోచ్ లో అప్పర్, మిడిల్ బెర్త్ వస్తే సమస్య మరింత పెరుగుతుంది. అందుకే భారతీయ రైల్వే గర్భిణీ ప్రయాణికులకు లోయర్ బెర్త్ కేటాయింపులో ప్రాధాన్యత కల్పిస్తోంది.
గర్భిణీ స్త్రీలు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో నేరుగా లోయర్ బెర్త్ కోరుకునే అవకాశం ఎందుకు ఉండకూడదనే అంశంపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై 2026 సెప్టెంబర్ 16న కోర్టు కేంద్ర ప్రభుత్వం, రైల్వే బోర్డు, ఐఆర్సీటీసీకి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత రైల్వే విధానంలో గర్భిణీ స్త్రీలకు లోయర్ బెర్త్ కోసం ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లో ప్రత్యేక ఆన్లైన్ ఆప్షన్ లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 30న జరగనుంది.
గర్భిణీ స్త్రీలతో పాటు 45 ఏళ్లు పైబడిన మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం రైల్వేలు ప్రత్యేక లోయర్ బెర్త్ కోటాను కేటాయిస్తున్నాయి. స్లీపర్ క్లాస్లో ఒక్కో కోచ్కు సాధారణంగా 6 నుంచి 7 లోయర్ బెర్త్లు ఈ కేటగిరీకి కేటాయిస్తారు. అదేవిధంగా 3AC కోచ్లో 4 నుంచి 5, 2ACలో 3 నుంచి 4 లోయర్ బెర్త్ లు అందుబాటులో ఉంటాయి. రైలు, కోచ్ల సంఖ్యను బట్టి ఈ సంఖ్యలో కొంత మార్పు ఉండొచ్చు.
టికెట్ బుక్ చేసుకున్నప్పుడు లోయర్ బెర్త్ అందుబాటులో లేకపోతే గర్భిణీ ప్రయాణికురాలికి మిడిల్, అప్పర్ బెర్త్ కేటాయించబడే అవకాశం ఉంది. లోయర్ బెర్త్ అందుబాటులో ఉందని భావించి దాన్ని ముందుగానే కచ్చితంగా పొందుతామని అనుకోవడం సరికాదు. కేటాయింపు అందుబాటుపై ఆధారపడి ఉంటుంది. అయితే, రైలు బయలుదేరిన తర్వాత ఖాళీగా ఉన్న లోయర్ బెర్త్ ఏదైనా ఉంటే, గర్భిణీ ప్రయాణికురాలు విధుల్లో ఉన్న టికెట్ చెకింగ్ సిబ్బందిని సంప్రదించవచ్చు. రైల్వే రూల్స్ ప్రకారం గర్భిణీకి ఖాళీ లోయర్ బెర్త్ ను కేటాయించే అధికారం ఆన్ బోర్డ్ టికెట్ చెకింగ్ సిబ్బందికి ఉంది.
గర్భిణీ స్త్రీలకు ఈ సౌకర్యం ఉన్నప్పటికీ, ఆ ప్రయోజనాన్ని ఆన్లైన్ బుకింగ్లో నేరుగా కోరుకునే ప్రత్యేక వ్యవస్థ లేకపోవడమే తాజా వివాదానికి కారణం అయ్యింది. పిటిషన్ ప్రకారం, ప్రస్తుతం ఆ బెనిఫిట్ పొందేందుకు రిజర్వేషన్ కౌంటర్ను ఆశ్రయించాల్సి వస్తోంది. గర్భిణీలు క్యూలో నిలబడటం, రిజర్వేషన్ సెంటర్ కు వెళ్లడం లావటి అదనపు ఇబ్బందులు ఎందుకు ఉండాలన్నదే పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించారు. అందుకే, ఆన్ లైన్ లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు రైల్వే నుంచి సమాధానం కోరింది. ఈ విషయంలో రైల్వే ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది సెప్టెంబర్ 30న జరిగే తదుపరి విచారణ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Also: బడ్జెట్ లో ఊటీ ట్రిప్.. హైదరాబాద్ నుంచి IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ!