Mumbai–Pune Expressway Toll Refund: ఫిబ్రవరి 3న పూణే-ముంబై ఎక్స్ ప్రెస్వేపై ప్రొపైలిన్ గ్యాస్ ట్యాంకర్ ప్రమాదం జరిగింది. ఖోపోలి సమీపంలో జరిగిన ఈ ఘటన కారణంగా 32 గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. ఎక్స్ ప్రెస్ వేలో గందరగోళం ఏర్పడింది. దీనివల్ల వేలాది వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. తినేందుకు తింటి, తాగేందుకు నీళ్లు లేక ప్రయాణీకులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ (MSRDC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం తర్వాత టోల్ వసూళ్లను నిలిపివేయాలని MSRDC ఆదేశాలు జారీ చేసినప్పటికీ, టోల్ వసూలు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై మహా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద సమంలో పూణే-ముంబై ఎక్స్ ప్రెస్ వేతో పాటు పూణే-బెంగళూరు హైవే రెండింటిలోనూ వసూలు చేసిన టోల్ ను రీఫండ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
ట్రాఫిక్ జామ్ సమయంలో సుమారు 1.2 లక్షల మంది వాహనదారుల నుంచి టోల్ వసూళు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి రూ.5.16 కోట్ల టోల్ రీఫండ్ చేయాలని నిర్ణయించింది. “సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసిన తర్వాత కూడా టోల్ తగ్గించబడిన ప్రయాణికుల డేటా మా దగ్గర ఉంది. వారి డబ్బు రాబోయే వారంలో వారి FASTag అకౌంట్స్ కు తిరిగి ఇవ్వబడుతుంది” అని MSRDC అధికారులు తెలిపారు. హాల్ట్ ఆర్డర్ జారీ చేసిన తర్వాత ఛార్జ్ చేయబడిన ప్రతి ప్రయాణికుడిని గుర్తించడానికి MSRDC ఇప్పటికే ముంబై-పుణే ఎక్స్ ప్రెస్ వే కార్యకలాపాలు, నిర్వహణ, టోల్ వసూళ్లను నిర్వహించే IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పూర్తి లావాదేవీల డేటాను కోరింది. అంతేకాదు, టోల్ వసూళ్లు వెంటనే ఎందుకు ఆగలేదో వివరించాలని కూడా IRBని ఆదేశించింది. ముంబై మార్గంలో ట్రాఫిక్ జామ్ సమయంలో వసూలు చేసిన టోల్ డబ్బును తిరిగి ఇస్తామని MSRDC గత వారం బాధిత ప్రయాణికులకు హామీ ఇచ్చింది. అందులో భాగంగానే తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. 1.2 లక్షల మందికి రూ. 5.16 కోట్లు అంటే, ఒక్కో వాహనదారుడికి సుమారు రూ.450 వరకు రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
టోల్ రీఫండ్ విషయంలో మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, డబ్బు వెనక్కి ఇవ్వడం మాత్రమే సరిపోదన్నారు. “టోల్ వాపసు ఇవ్వడం పెద్ద విషయం కాదు. వారు ఎలాంటి సర్వీసును అందించకుండా డబ్బు వసూలు చేశారు. ప్రయాణికులు ఎటువంటి సహాయం, మళ్లింపు, తక్షణ ఉపశమనం లేకుండా ట్రాఫిక్ లో గంటల తరబడి చిక్కుకుపోయారు. అదే తీవ్ర నిర్లక్ష్యం. MSRDC ఆదేశాలను ధిక్కరించిన టోల్ వసూళు చేశారు. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ఈ గందరగోళానికి ఎవరు బాధ్యులో ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పాలి. ట్రక్ డ్రైవర్ పై మాత్రమే FIR నమోదు చేయడం సరిపోదు ” అన్నారు.
Read Also: ఫ్లైట్ టికెట్ కొనేందుకు డబ్బులు లేవా? నో టెన్షన్, హ్యాపీగా ట్రావెల్ చెయ్యొచ్చు!