బీహార్ లో పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్ మెంట్ నియామక పరీక్షకు హాజరయ్యే వేలాది మంది అభ్యర్థులు పాట్లీపుత్ర రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు సరిపడా రైళ్లు అందుబాటులో లేవని ఆరోపిస్తూ.. రైల్వే ట్రాక్ లపైకి చేరుకుని రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ ఘటన కారణంగా గంటల తరబడి రైల్వే సేవలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇవాళ జరగనున్న పోలీసు నియామక పరీక్ష కోసం అభ్యర్థులు శనివారం రాత్రి నుంచే స్టేషన్ కు చేరుకోవడం ప్రారంభించారు. అయితే, పరీక్షలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు వస్తారని తెలిసినా, తగిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని వారు ఆరోపించారు. స్టేషన్ లో జనాల సంఖ్య పెరగడంతో ఆందోళనకు దిగారు. అదే సమయంలో పాట్లీపుత్ర నుంచి కతిహార్ కు వెళ్లే ప్రత్యేక పరీక్ష రైలులో ఎక్కేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ప్రయత్నించారు. దీంతో రద్దీ పెరిగి తొక్కిసలాట పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతసేపటికి ఆగ్రహించిన అభ్యర్థులు రైల్వే ట్రాక్ లపై కూర్చుని నిరసన ప్రారంభించారు. అదనపు రైళ్లు నడపాలని డిమాండ్ చేశారు.
రైళ్లకు అంతరాయం ఏర్పడ్డంతో పోలీసుల ఎంట్రీ
నిరసన తీవ్రరూపం దాల్చడంతో రైలు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అనేక రైళ్లు పలు స్టేషన్లు, ప్లాట్ ఫారమ్ ల దగ్గర నిలిచిపోయాయి. కొన్ని రైళ్లలో విధ్వంసం కూడా జరిగినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రైల్వే అధికారులు, జిల్లా అధికారు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అభ్యర్థులను ఆందోళన విరమించాలని సూచించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
జనసమూహాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అయినప్పటికీ కొందరు నిరసన కొనసాగించడంతో పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కొందరు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. ఇన్ స్పెక్టర్ జనరల్ జితేంద్ర రాణా, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
ఆందోళన కొనసాగుతున్న సమయంలో స్టేషన్లో భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి అభ్యర్థులను వారి పరీక్షా కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేపట్టారు. సుమారు నాలుగు, ఐదు గంటల పాటు కొనసాగిన ఈ ఆందోళన కారణంగా రైలు సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనంతరం అధికారులు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
Read Also: టాయిలెట్ దగ్గర నిద్ర నుంచి.. వందేభారత్ ప్రయాణం దాకా.. నెట్టింట సోనూసూద్ వీడియో వైరల్!