Sonu Sood Railway Journey: ప్రముఖ నటుడు, కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న సోనూ సూద్ తాజాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ రైల్వేలో వచ్చిన మార్పులను చూసి ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా, తన జీవితంలోని కష్టకాలాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు నటుడు కావాలనే కలతో ముంబైకి వెళ్లిన రోజుల జ్ఞాపకాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా తన ఎక్స్ పీరియెన్స్ ను వెల్లడించారు. ప్రస్తుతం భారతీయ రైల్వే అందిస్తున్న సౌకర్యాలు, సర్వీసులు తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. రైలులో అందిస్తున్న ఆహారం నుంచి ప్రయాణికులకు అందిస్తున్న సేవల వరకు అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ ప్రయాణం తన మొదటి రైలు ప్రయాణాన్ని గుర్తు చేసిందని సోనూ సూద్ తెలిపారు. నాగ్ పూర్ లో చదువు పూర్తి చేసుకుని, హీరో అవ్వాలనే ఆశతో ముంబై వెళ్లిన రోజులు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని చెప్పారు. ఆ సమయంలో రైలులో రిజర్వేషన్ టికెట్ కూడా దొరకడం చాలా కష్టంగా ఉండేదన్నారు. జనరల్ బోగీల్లోనే ప్రయాణించాల్సి వచ్చేదని గుర్తుచేసుకున్నారు.
ప్రయాణ సమయంలో పడుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదని, కొన్ని సందర్భాల్లో రైలు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని నిద్రపోయిన రోజులున్నాయన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, భారతీయ రైల్వేలో వచ్చిన అభివృద్ధి నిజంగా అద్భుతం అన్నారు. సామాన్య ప్రజల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే శాఖ చేస్తున్న కృషిని సోనూ సూద్ అభినందించారు. ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం దేశ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 160కి పైగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు వివిధ మార్గాల్లో సేవలందిస్తున్నాయి. వేగం, సౌకర్యం, ఆధునిక సాంకేతికత కారణంగా ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వందే భారత్ రైళ్లలో ఎయిర్ కండిషనింగ్, వై ఫై, మొబైల్ ఛార్జింగ్ సదుపాయాలు, ఆధునిక సీటింగ్ లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి, నాగ్ పూర్-సికింద్రాబాద్ లాంటి మార్గాల్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. త్వరలో సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి, విజయవాడ నుంచి బెంగళూరుకు ప్రత్యేక స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
అదే సమయంలో దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా వేగంగా ముందుకు సాగుతోంది. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో తొలి బుల్లెట్ ట్రైన్ను 2027 ఆగస్టు 15న ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గే అవకాశం ఉంది. ముంబై-పుణె-హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ డీపీఆర్ రెడీ అయ్యింది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రారంభమైతే ప్రస్తుతం 12 నుంచి 15 గంటలు పట్టే ప్రయాణం మూడు గంటలలోపు పూర్తయ్యే అవకాశం ఉంది.
Read Also: హైదరాబాద్ To తిరుమల కారవాన్ జర్నీ.. ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందంటే?