Hyderabad Bird Survey 2026: హైదరాబాద్ అంటే ట్రాఫిక్, ఐటీ కంపెనీలు, భారీ భవనాలు మాత్రమే కాదు. ప్రకృతిని ప్రేమించే వారికి.. పక్షుల నిలయంగానూ మారుతోంది. భాగ్యనగరంలో తాజాగా నిర్వహించిన హైదరాబాద్ బర్డ్ అట్లాస్ (HBA) నాలుగో సీజన్ సర్వేలో మరో మూడు కొత్త పక్షి జాతులను గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన మొత్తం పక్షి జాతుల సంఖ్య 248కు చేరింది. ఈ ఫలితాలు నగరంలో అద్భుతమైన జీవవైవిధ్యం ఉందని మరోసారి నిరూపించాయి.
తాజాగా హైదరాబాద్ బర్డ్ అట్లాస్ సభ్యులు జూలై 2026లో నిర్వహించిన సర్వేలో గ్రేటర్ ఫ్లెమింగో, ఎల్లో ఫూటెడ్ గ్రీన్ పిజియన్, బ్రౌన్ క్యాప్డ్ పిగ్మీ వుడ్పెక్కర్ అనే మూడు కొత్త పక్షి జాతులు గుర్తించారు. జూలై 4 నుంచి 22 రోజుల పాటు సాగిన ఈ సర్వేలో 200 మందికిపైగా వాలంటీర్లు పాల్గొన్నారు. సరస్సులు, అడవులు, పార్కులు, నగర శివారు ప్రాంతాలు సహా పలు చోట్ల తిరిగి పక్షులను పరిశీలించారు.
హైదరాబాద్ బర్డ్ అట్లాస్ కార్యక్రమం 2025 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి, జూలై నెలల్లో రెండు సార్లు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, ఫోటోగ్రాఫర్లు, పక్షులపై ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలు కూడా ఇందులో భాగమవుతున్నారు. HBA మొదటి సీజన్ లో భాగంగా ఫిబ్రవరి 2025లో సర్వే నిర్వహించింది. ఇందులో 53 వలస పక్షులతో సహా 195 పక్షి జాతులను గుర్తించింది. గత సంవత్సరం జూలైలో జరిగిన సర్వే రెండవ దశలో, 166 పక్షి జాతులన ఐడెంటిఫై చేసింది. వీటిలో మొదటి దశలో నమోదు కాని 23 కొత్త జాతులు ఉన్నాయి. మొదటి రెండు సీజన్లలో నమోదు చేసిన మొత్తం పక్షి జాతుల సంఖ్య 218కి చేరింది.
ఇక ఈ ఏడాది 2026 ఫిబ్రవరిలో జరిపిన సర్వేలో మరో 27 కొత్త జాతులను గుర్తించగా, మొత్తం జాతుల సంఖ్య 245కి చేరింది. తాజాగా జూలైలో నిర్వహించిన సర్వేలో 3 కొత్త జాతులను గుర్తించింది. దీంతో మొత్తంగా ఈ సంఖ్య 248కి చేరింది. ఈ ప్రాజెక్ట్ ను మరింత విస్తరించే దిశగా 2027 ఫిబ్రవరి, జూలై నెలల్లో ఐదో, ఆరో సీజన్ సర్వేలను నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైంది. కొత్త వాలంటీర్లను కూడా ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్ బర్డ్ అట్లాస్ సభ్యుడు శ్రీరామ్ రెడ్డి ఈ సర్వేకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సర్వే ద్వారా పక్షులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఏ కాలంలో ఏ జాతులు వస్తున్నాయి? వాటి నివాస ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి? లాంటి కీలక సమాచారం సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ డేటా భవిష్యత్తులో పక్షుల సంరక్షణతో పాటు పట్టణ జీవవైవిధ్య ప్రణాళికలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
కాంక్రీట్ జంగల్ గా మారుతోందనుకునే హైదరాబాద్లో ఇంత భారీ సంఖ్యలో పక్షి జాతులు నమోదవడం నిజంగా విశేషం. ఈ సర్వే నగరంలోని ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూనే, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెబుతోంది. నగర అభివృద్ధితో పాటు ప్రకృతిని కూడా కాపాడితేనే భవిష్యత్ తరాలకు ఇలాంటి జీవవైవిధ్యం అందుబాటులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: రాగాలు పలికే రాళ్లు.. నల్లగొండలోని ఈ వింత ప్రదేశం గురించి తెలుసా?