IRCTC New Facility: భారతీయ రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా తమ బోర్డింగ్ పాయింట్ను మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ మార్పు వల్ల చివరి నిమిషంలో ప్లాన్ మారినా, ప్రయాణాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేసే అవకాశం ఉంది.
ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. తాజాగా దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం, చివరి రిజర్వేషన్ చార్ట్ సిద్ధమయ్యే వరకు ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవచ్చు. అంటే, రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు కూడా ఈ మార్పు చేసుకోవచ్చు. ఈ నిబంధన ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, ఒకే నగరంలో పలు రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఇలా మార్చుకోవడం వల్ల ఎక్కడైనా రైలు ఎక్కే అవకాశం ఉంది.
ఈ సౌకర్యం వల్ల ప్రయాణికులు తమకు అనుకూలమైన స్టేషన్ను చివరి నిమిషంలో కూడా ఎంచుకోవచ్చు. ఒక వ్యక్తి మొదట ఒక స్టేషన్ నుండి ఎక్కాలని ప్లాన్ చేసి, తరువాత మరో స్టేషన్ దగ్గరగా అనిపిస్తే, వెంటనే బోర్డింగ్ పాయింట్ను మార్చుకుని అక్కడి నుంచే రైలు ఎక్కవచ్చు. ఇంతకుముందు ఈ మార్పు చేయడానికి రిజర్వేషన్ చార్ట్ తయారు కాకముందే చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ పరిమితి కొంచెం సడలించబడింది.
తాజాగా బోర్డింగ్ స్టేషన్ మార్పుకు సంబంధించి రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ప్రయాణికులు మొదట ఎంచుకున్న స్టేషన్ లో రైలు ఎక్కలేకపోయినా, తర్వాతి స్టేషన్ నుంచి ఎక్కే అవకాశం ఉండడం వల్ల వారి సీటు కోల్పోయే ప్రమాదం తగ్గుతుంది. కానీ, ఇప్పుడు ప్రయాణికులకు ఒక పెద్ద ఉపశమనం అని చెప్పాలి.
అయితే, ఈ సౌకర్యం అందరికీ అందుబాటులో ఉండదు. ఇది కేవలం కన్ఫర్మ్ అయిన టిక్కెట్లు, ఆర్ఏసీ (RAC) టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్నవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించలేరు. అలాగే, బోర్డింగ్ పాయింట్ ను ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది.
బోర్డింగ్ స్టేషన్ ను ఆన్ లైన్ లో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ లో లాగిన్ కావాలి. తర్వాత ‘My Account’ లోకి వెళ్లి ‘My Transactions’ ద్వారా ‘Booked Ticket History’ ని ఓపెన్ చేయాలి. అక్కడ మీ టికెట్ను ఎంచుకుని “Change Boarding Point” అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తరువాత మీకు కావాల్సిన స్టేషన్ను ఎంపిక చేసి నిర్ధారిస్తే సరిపోతుంది. వెంటనే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కౌంటర్ టిక్కెట్లు ఉన్నవారు సమీప రైల్వే స్టేషన్లోని PRS కౌంటర్కి వెళ్లి ఈ మార్పు చేయించుకోవచ్చు.
Read Also: విమాన ప్రయాణికులకు షాక్.. 60% ఉచిత సీట్ల రూల్ కు బ్రేక్!