Rajagopal Reddy: స్వేచ్చ బ్యూరో: తనకు పదవులు అడుక్కోవడం తెలియదని, కొట్లాడటమే తన రోల్ అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా ఏళ్ల తర్వాత గాంధీభవన్ కు వచ్చిన ఆయన శనివారం వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి చిట్ చాట్ చేశారు. తనకు మంత్రి పదవి రాకపోవడానికి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండటమే కారణమనే ప్రచారాన్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. “నేను, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకే కుటుంబం కాదు. మేమిద్దరం అన్నదమ్ములైనా మా కుటుంబాలు వేరు. నా ఫ్యామిలీ నాది, వెంకట్ రెడ్డి ఫ్యామిలీ వెంకట్ రెడ్డిది.
హుజూర్ నగర్ ఎమ్మెల్యే (ఉత్తమ్ కుమార్ రెడ్డి), కోదాడ ఎమ్మెల్యే (పద్మావతి) మాత్రమే ఒకే కుటుంబం అవుతారు. మంత్రి పదవి విషయంలో వెంకట్ రెడ్డితో నాకేం సంబంధం?” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల ముందు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చిన వారిలో జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, వివేక్ వెంకట్ స్వామి, తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రి పదవులు ఇచ్చారని, కానీ నా విషయంలోనే ఏఐసీసీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. తనకుమాత్రమే మంత్రి పదవి ఇవ్వలేరన్నారు. నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కేసీఆర్ను నిద్రపోనివ్వకుండా చేసింది తానేనని, తాను రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతే తన నియోజకవర్గానికి వందమంది ఎమ్మెల్యేలు వచ్చారని గుర్తుచేశారు.
Also read: KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో భారీ కొండ చిలువ హల్ చల్..!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పూర్తి మద్దతు పలికారు. ఏఐసీసీ ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.”రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బలమైన అనుబంధం ఉన్న కీలక నేత. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటం మరువలేనిది. ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన అండగా నిలిచారు. రాజగోపాల్ రెడ్డి టీమ్గా పనిచేస్తేనే పార్టీకి మేలు జరుగుతుంది” అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.మంత్రి పదవి విషయంలో అసంతృప్తి ఉన్నప్పటికీ, తమ ప్రధాన లక్ష్యం మాత్రం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి ఇద్దరూ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవాలని, తమకు పదవుల కంటే రాహుల్ గాంధీ నిర్ణయమే ఫైనల్ అని వారు తేల్చి చెప్పారు.
ఇటీవల కాలంలో వివాదాస్పదంగా మారిన తుంగతుర్తి నియోజకవర్గ వ్యవహారంపై కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చిందన్నారు తుంగతుర్తి స్థానిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేదని, స్థానిక కాంగ్రెస్ నాయకులే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.”ఇలాంటి పంచాయితీలు మాట్లాడటం జగ్గారెడ్డికే అప్పగించడం బెటర్ అంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
Also read: Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!