Diwali Special Trains 2026: దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగలు దగ్గర పడుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగల సమయంలో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరగడంతో, రద్దీని తగ్గించేందుకు 100కు పైగా ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.
ప్రతి ఏడాది దుర్గా పూజ, దీపావళి, ఛత్ పూజ సమయంలో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు పండుగలకు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో రైళ్లను ఆశ్రయిస్తారు. దీంతో సాధారణ రైళ్లలో సీట్ల కోసం డిమాండ్ పెరగడంతో పాటు, వెయిటింగ్ లిస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
ఈ ప్రత్యేక రైళ్లు దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను పండుగల సమయంలో ఎక్కువ డిమాండ్ ఉండే ప్రాంతాలను లింక్ చేయనున్నాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సర్వీసులను రూపొందిస్తున్నారు. దీంతో సాధారణ రైళ్లపై ఒత్తిడి కొంత తగ్గడంతో పాటు, ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యం ఈజీ కానుంది.
ప్రత్యేక రైళ్లతో పాటు ఇప్పటికే నడుస్తున్న కొన్ని సాధారణ రైళ్లకు అదనపు కోచ్లను కూడా జోడించనున్నారు. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులకు టికెట్లు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. పండుగ సమయంలో రైల్వే సేవలపై భారీగా పెరిగే డిమాండ్ను ఎదుర్కొనేందుకు ఇది మరో ముఖ్యమైన చర్యగా చెప్పవచ్చు.
అటు టికెట్ల బుకింగ్ విషయంలోనూ ప్రయాణికులకు మెరుగైన ఎక్స్ పీరియెన్స్ అందించేందుకు IRCTC తన నెక్స్ట్ జనరేషన్ ఇ టికెటింగ్ (NGeT) ప్లాట్ ఫారమ్ను అప్గ్రేడ్ చేసింది. పండుగ సీజన్లో తక్కువ సమయంలో భారీ సంఖ్యలో ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో వెబ్ సైట్, యాప్ పై ఒక్కసారిగా ఎక్కువ ట్రాఫిక్ భారం పడుతోంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని సర్వర్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, ఆటోమేటెడ్ బాట్స్ ను నియంత్రించే చర్యలను కూడా మెరుగుపరిచారు.
ఆన్లైన్ టికెట్ బుకింగ్లో బాట్స్ కారణంగా సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాంటీ బాట్ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా నిజమైన ప్రయాణికులకు మరింత సమర్థవంతమైన బుకింగ్ అవకాశం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ రైల్వే. దీపావళి పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్లు, మెరుగైన ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థతో ప్రయాణికుల రద్దీని మెయింటెయిన్ చేసేందుకు రైల్వే సిద్ధమవుతోంది.
Read Also: భారత్కు రష్యా హైస్పీడ్ గిఫ్ట్.. వందే భారత్ ను తలదన్నే కొత్త రైలు వచ్చేస్తోంది!