రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, సంక్షేమ పథకాలు పేదల దరికి చేరడం లేదన్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోకపోవడం, వారి డిమాండ్లను పరిష్కరించకపోవడంతోనే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై జరిగిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగుల ముఖాల్లో నేడు సంతోషం కరువైందని, కనీసం ఈ ప్రభుత్వం వారికి గౌరవం కూడా ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కూడా సీఎం రేవంత్కు భయపడుతున్నారని, మీరేమీ బానిసలు కాదు..తల్లి కాంగ్రెస్నే గజగజలాడించి రాష్ట్రం తెచ్చుకున్నాం.. ఇది పిల్ల కాంగ్రెస్.. దీనికి ఎందుకు భయపడుతున్నారని ఆమె అన్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళనకు టీఆర్ఎస్ నైతిక మద్దతిస్తుందని, వారి పోరాటాలకు అండగా ఉండి పరిష్కారమయ్యేదాకా నిలబడుతుందని ఆమె భరోసా నింపారు.
సీఎం రేవంత్రెడ్డి .. తన గురువు చంద్రబాబును చూసి పాఠాలు నేర్చుకోవాలని కవిత హితవు పలికారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ నిలబడలేదని ఆమె హెచ్చరించారు. పోలీసుల పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని,ఒక్కో జిల్లాలో 2వేల మంది ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యలో ఇంకా 40 శాతం ఖాళీలున్నా భర్తీ చేసే దమ్ము ప్రభుత్వానికి లేదన్నారు. 2003 డీఎస్సీకి సంబంధించిన వారి పాత పింఛన్ స్కీమ్ను నిలిపివేశారన్నారు. వీరందరికీ ఓపీఎస్ విధానాన్ని అమలు చేయడం ద్వారా సర్కార్కు బెనిఫిట్ అవుతుందని తెలిపారు కవిత.
రెండేండ్లు ఆగాలని సీఎం బాజాప్తా బెదిరిస్తున్నారని, రెండేండ్ల తరువాత కాంగ్రెస్ ఉండదు.. రేవంత్ ఉండడని, వచ్చే సర్కార్ తమదేనని, ఉద్యోగులను కంటి రెప్పలా కాపాడుకుంటామన్నారు కవిత.
అడిగిన జీతిమివ్వని మిడిమేలుపు దొరని గొల్చి మిడుకుట కంటెన్.. వడిగల ఎద్దులు గట్టుక మడి దున్నక బతుకవచ్చు మహిలో సుమతీ! అని రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్దేశించి ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో పీఆర్సీ ఇవ్వకున్నా డీఏలు ఇచ్చారని, ఇక్కడ అది కూడా లేదన్నారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ పదే పదే పోరాటాలకు పిలుపునిచ్చి వెనక్కి తగ్గడంతో తోటి ఉద్యోగుల్లో విలువ లేకుండా పోయిందని, ఇకపై ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయాలని, 18 తరువాత హైదరాబాద్ను దిగ్బంధనం చేయాలని, దీనికి టీఆరెస్ సపోర్టుగా ఉంటుందన్నారు.
2023లోనే పీఆర్సీ పరిమితి ముగిసిందని, మూడు సంవత్సరాలైనా దీనిపై అతీగతీ లేదన్నారామె. 51శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సందేనని ఆమె డిమాండ్ చేశారు. హెల్త్కార్డులు ఎక్కడా పనిచేయడం లేదని, ఒకవేళ పనిచేసినట్టు నిరూపిస్తే తాను దేనికైనా సిద్దమేనని, సీఎం రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా 6-12 శాతం మిత్తీ చెల్లించి మరీ ఇవ్వాలన్నారు. ఐదు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులది కూడా దీన స్థితి ఉందని, వీరు పెద్ద మనుసుతో జీతాలు రాకున్నా పనిచేస్తున్నారన్నారు.