Alla Nani Death: ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని గుండెపోటులో కన్నుమూశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నాని.. ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన హఠన్మరణంతో రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. అటు వైసీపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఆళ్ల నాని నేపథ్యానికి వస్తే.. ఆయన 1969 డిసెంబర్ 30న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల సూర్యచంద్రరావు, నాగమణి దంపతులకు జన్మించారు. ఆయన ఏలూరులోని కేపీ హైస్కూల్ లో 1985లో పదో తరగతి, 1988లో సర్. సీఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో బీఏలో చేరి.. చదువు మధ్యలోనే ఆపేశారు.
ఇక పొలిటికల్ కెరీర్ కు వస్తే.. ఆళ్ల నాని 1994, 1999లో కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి అంబికా కృష్ణపై 33 వేలకు పైగా ఓట్లతో గెలిచి మెుదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2009 లోనూ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. అటు 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన నాని.. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి గెలుపొందారు.
Also Read: నఖ్వీతో బీసీసీఐ పెద్దలు రాసుకు పూసుకు తిరగొచ్చు, కానీ ట్రోఫీ ఇస్తే ఉగ్రవాదమా ?
గత వైసీపీ ప్రభుత్వంలో ఆళ్ల నాని కీలక బాధ్యతలు పోషించారు. ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2024 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఓటమి పాలైన నాని.. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2024 ఆగస్టు 17న వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి.. కొద్ది కాలం రాజకీయ సన్యాసం చేశారు. అనంతరం 2025 ఫిబ్రవరి 13న తెలుగు దేశం పార్టీలో చేరారు. అయినప్పటికీ వ్యక్తిగత కారణాల రిత్యా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన హఠాన్మరణం వైసీపీతో పాటు టీడీపీలోనూ దిగ్భ్రాంతి కలిగించింది.
Also Read: 14 బోగీలు.. 400 మంది ప్రయాణికులు.. భారత తొలి రైలు ప్రయాణం ఎలా సాగిందంటే!