Story of India’s First Passenger Train: ముంబైలో లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే లోకల్ రైళ్లు అక్కడి ప్రజల జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. అయితే, ఈ భారీ రైల్వే వ్యవస్థకు ఒక చిన్న ప్రయాణం పునాది వేసింది. అదే, 1853 ఏప్రిల్ 16న బొంబాయి బోరి బందర్ నుంచి థానే వరకు సాగిన తొలి కమర్షియల్ ప్రయాణీకుల రైలు ప్రయాణం. ఆ రోజున సుమారు 34 కిలోమీటర్ల దూరాన్ని స్ట్రీమ్ రైలు దాదాపు గంటా 15 నిమిషాల్లో పూర్తి చేసింది. ఈ ప్రయాణం దేశంలో కమర్షియల్ ప్రయాణీకుల రైలు సేవలకు అధికారికంగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
ఈ హిస్టారికల్ రైలును గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే (GIPR) నడిపించింది. రైలులో 14 ప్యాసింజర్ కోచ్లు, సుమారు 400 మంది ప్రయాణికులు ఉన్నారు. సాహిబ్, సింధ్, సుల్తాన్ అనే మూడు స్ట్రీమ్ లోకోమోటివ్లు ఈ రైలును ముందుకు తీసుకెళ్లాయి. ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ప్రాంతానికి సమీపంలోని బోరి బందర్ నుంచి రైలు బయలుదేరి థానే చేరుకుంది. అప్పట్లో రైలును చూడటం ప్రజలకు కొత్త. అందుకే, పట్టాల వెంట పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఈ ప్రయాణాన్ని చూశారు.
ఈ రైలును ప్రారంభించడం అప్పటి బొంబాయి నగరంలో పెద్ద కార్యక్రమంగా జరిగింది. ప్రజలు ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు వీలుగా ఏప్రిల్ 16న ప్రభుత్వ సెలవు ప్రకటించింది. రైలు బయలుదేరే సమయంలో 21 తుపాకుల గౌరవ వందనం కూడా నిర్వహించారు. ఆవిరి ఇంజిన్ నుంచి వెలువడే పొగ, శబ్దం, కదులుతున్న కోచ్లు.. అప్పటి ప్రజలకు అది పూర్తిగా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి.
బోరి బందర్–థానే మార్గం కేవలం 34 కిలోమీటర్లే అయినా, దాని ప్రభావం చాలా దూరం వరకు వెళ్లింది. రైలు ద్వారా ప్రయాణికులతో పాటు సరుకులను కూడా వేగంగా తరలించే అవకాశం ఏర్పడింది. దీంతో బొంబాయి లాంటి అభివృద్ధి చెందుతున్న నగరానికి చుట్టుపక్కల ప్రాంతాలతో రవాణా సంబంధాలు మరింత బలపడ్డాయి. తర్వాత GIPR తన రైల్వే నెట్ వర్క్ ను క్రమంగా విస్తరించింది. కొత్త పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు రైలు మార్గాలతో లింక్ అయ్యాయి. రైల్వే రవాణా కేవలం ప్రయాణ సాధనం కాకుండా ఆర్థిక అభివృద్ధికి కూడా కీలకంగా మారింది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. 1853కి ముందు దేశంలో రైలు ఎప్పుడూ నడవలేదని చెప్పడం పూర్తిగా సరైనది కాదు. అప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైల్వేకు సంబంధించిన ప్రయోగాలు జరిగాయి. నిర్మాణ పనులకు అవసరమైన సామగ్రిని తరలించేందుకు కూడా రైలును ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, బొంబాయి–థానే రైలు ప్రత్యేకత ఏంటంటే? సాధారణ ప్రజల కోసం నిర్వహించిన తొలి కమర్షియల్ ప్రయాణీకుల రైల్వే సర్వీస్. అందుకే ఈ ప్రయాణానికి భారత రైల్వే చరిత్రలో ప్రత్యేక గుర్తింపు లభించింది.
1853లో సుమారు 400 మందితో ప్రారంభమైన ఆ రైలు ప్రయాణం తర్వాత ముంబై రైల్వే వ్యవస్థ ఎన్నో దశాబ్దాల్లో విస్తరించింది. నగరం పెరిగే కొద్దీ రైల్వేల అవసరం కూడా పెరిగింది. ప్రస్తుతం ముంబైలోని సబర్బన్ రైళ్లు ప్రతిరోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి.
Read Also: భారత్కు రష్యా హైస్పీడ్ గిఫ్ట్.. వందే భారత్ ను తలదన్నే కొత్త రైలు వచ్చేస్తోంది!