Indian Railways AC Coach Bedroll Theft: రైళ్లలో ప్రయాణించే సమయంలో ఏసీ కోచ్ ప్రయాణికులకు అందించే బెడ్ రోల్ కిట్ల దొంగతనం భారతీయ రైల్వేకు పెద్ద తలనొప్పిగా మారింది. గత నాలుగేళ్లలో ఏసీ కోచ్ల నుంచి పెద్ద సంఖ్యలో బెడ్ షీట్లు, దుప్పట్లు, టవల్స్, దిండ్లు, పిల్లో కవర్లు మాయమైనట్లు గుర్తించారు. వీటి నష్టం రూ.104 కోట్లకుపైగా ఉంటుందని వెల్లడించింది. RTI కింద సేకరించిన వివరాల ఆధారంగా నిర్వహించిన దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. దేశంలోని 18 రైల్వే జోన్లలో 16 జోన్ల పరిధిలోని 54 రైల్వే డివిజన్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, 2022 నుంచి 2025 మధ్య బెడ్ రోల్స్ వస్తువులు దొంగతనాలు సుమారు 56 శాతం పెరిగినట్లు తేలింది.
జనవరి 2022లో కోవిడ్ తర్వాత ఏసీ కోచ్ లలో బెడ్ రోల్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి మే 2026 వరకు ప్రయాణికులు కనీసం 1.27 కోట్ల లినెన్ వస్తువులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా బెడ్ రోల్ సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సుమారు రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఏసీ కోచ్ లలో ప్రతి ప్రయాణికుడికి సాధారణంగా రెండు బెడ్ షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, ఒక పిల్లో కవర్, ఒక ఫేస్ టవల్ తో కూడిన బెడ్ రోల్ కిట్ను అందిస్తారు. అయితే, ప్రయాణం ముగిసిన తర్వాత వీటిలో చాలా వస్తువులు తిరిగి అందకపోవడం రైల్వే అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. దొంగిలించబడిన వస్తువుల్లో ఫేస్ టవల్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. నాలుగేళ్లలో దాదాపు 46.54 లక్షల టవల్స్ కనిపించకుండా పోయాయి. ఆ తర్వాత 41.13 లక్షల బెడ్ షీట్లు, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల దుప్పట్లు మాయమయ్యాయి. దిండ్లు పెద్దవిగా ఉండటంతో వాటి దొంగతనం తక్కువగా ఉంది. అయినప్పటికీ 2.76 లక్షల దిండ్లు కూడా కనిపించకుండా పోయాయి.
ప్రాంతాల వారీగా చూస్తే, బికనీర్ రైల్వే డివిజన్లో అత్యధికంగా 25.76 లక్షల లినెన్ వస్తువులు మాయమయ్యాయి. తరువాత రాంచీలో 9.31 లక్షలు, ఢిల్లీలో 8.21 లక్షలు, ముంబైలో 8.17 లక్షలు, జోధ్ పూర్ లో 8.09 లక్షలు, అహ్మదాబాద్ లో 6.94 లక్షల వస్తువులు కనిపించకుండా పోయినట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే అధికారుల ప్రకారం, కోచ్ లలో బెడ్ రోల్ పంపిణీ, వాటి నిర్వహణ బాధ్యత కాంట్రాక్టు సంస్థలదే. ప్రయాణం తర్వాత ఏవైనా వస్తువులు తిరిగి రాకపోతే, వాటిని కొత్తగా కొనుగోలు చేసి భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా కాంట్రాక్టర్లపైనే ఉంటుంది. దీంతో వారికి భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఈ సమస్యను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. లినెన్ వస్తువుల దొంగతనాలను అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Read Also: టికెట్ లేకున్నా వారిని రైల్లో నుంచి దించకూడదట, ఇండియన్ రైల్వేలో చాలామందికి తెలియని సేఫ్టీ రూల్..