IndiGo Offer: ట్రెండ్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు కొందరు వ్యక్తులు. వ్యాపారానికైనా అదే ఫార్ములా వర్తిస్తుంది. విమాన ప్రయాణికులకు బంపరాఫర్ ఇచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్. ఏకంగా 20 వేలు ఉచితంగా టికెట్లు ఇవ్వనుంది. నమ్ముడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. ఇంతకీ అసలు మేటరేంటి?
తమ సంస్థ కార్యకలాపాలు మొదలుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది ఇండిగో. 2006 ఆగస్టు 4న ఢిల్లీ-ఇంఫాల్ మధ్య తొలి విమాన సర్వీసును ప్రారంభించింది. అప్పటి నుండి విమానాల సర్వీసులను క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. ఇండిగో ఫ్రీ పేరుతో 20 వేల మంది ఉచిత టికెట్లు అందించనుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది ఆ సంస్థ. ఈ ఆఫర్ ఆగస్టు 4-6 వరకు మాత్రమే. సంస్థ వెబ్సైట్, మొబైల్ యాప్, 6ఎస్కై ఏఐ వర్చువల్ అసిస్టెంట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కేవలం దేశీయ విమాన టికెట్లకు మాత్రమే.
ఆఫర్ సమయంలో బుకింగ్ చేసినవారిలో కేవలం 20 వేల మందిని ఎంపిక చేయనుంది. వారికి ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ఓ ప్రశ్న అడుగుతుంది. సరైన సమాధానం కోసం మూడు ఆప్షన్లు కూడా ఉంటాయి. సరైన సమాధానం చెప్పిన ప్రయాణికులకు టికెట్ చార్జీని గరిష్ఠంగా రూ.10 వేల వరకు చెల్లిస్తారు. నగదును 3 – 5 పని రోజుల్లో వారి ఖాతాకు జమ చేయనుంది ఇండిగో. అయితే ఈ ఆఫర్ దేశీయ మార్గాల్లో వన్-వే, రిటర్న్ ప్రయాణాలు, ఎకానమీ క్లాస్- ఇండిగోస్ట్రెచ్ బుకింగ్లు రెండింటికీ వర్తించనుంది. ఈ ఆఫర్ తమ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుందని తెలిపింది.
ఇండిగో రోజుకు దాదాపు 2,200 విమాన సర్వీసులు నడుపుతోంది. అందులో దేశీయంగా 97, అంతర్జాతీయ స్థాయిలో 40 కుపైగా గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది. భవిష్యత్తులో అంటే 2030 నాటికి తన విమానాల సర్వీసులను 550 కి పైగా విస్తరించాలని ఆలోచన చేస్తోంది. ఆ లెక్కన ప్రతిరోజూ సుమారు 3 వేల విమానాలను నడపాలన్నది ఆ సంస్థ డ్రీమ్. తమ సంస్థ ద్వారా ఏటా దాదాపు 20 కోట్ల మంది ప్రయాణికులను చేరవేయాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. 2030 నాటికి అంతర్జాతీయ కార్యకలాపాల్లో తమ సామర్థ్యం దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉంటుందని ఓ అంచనా.
ALSO READ: హైదరాబాద్ మెట్రో ఎక్కాలంటే భయం.. ఢిల్లీ తరహాలో కోచ్ల సంఖ్య ఎందుకు పెంచలేదు?