Delhi Metro vs Hyderabad Metro: దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో రైలు ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో, హైదరాబాద్ మెట్రో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అయితే, ఈ రెండు మెట్రో వ్యవస్థల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకూ రద్దీ పెరుగుతున్నా ఇప్పటికీ మూడు కోచ్ల రైళ్లు మాత్రమే నడుస్తుండటం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఢిల్లీలో మాత్రం డిమాండ్ కు అనుగుణంగా కోచ్ ల సంఖ్య ఉంది. ఇంతకీ రెండు మెట్రోల మధ్య ఏంటి తేడా అనేది ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీ మెట్రో పూర్తిగా కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తోంది. ప్రస్తుతం దాదాపు 393 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మెట్రోలో 4, 6, 8 కోచ్ల రైళ్లు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ముందుగానే అంచనా వేసి స్టేషన్లు, ప్లాట్ ఫారమ్లను కూడా ఇందుకు తగినట్లుగా నిర్మించారు. అందుకే అవసరాన్ని బట్టి కోచ్ల సంఖ్యను పెంచడం అక్కడ ఈజీ అయ్యింది.
మరోవైపు హైదరాబాద్ మెట్రో మాత్రం పబ్లిక్- ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (PPP) విధానంలో ఎల్ అండ్ టీ, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తోంది. నగరంలో మూడు మార్గాల్లో సుమారు 69.2 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తోంది. స్టేషన్లను 6 కోచ్ల రైళ్లు ఆగేలా నిర్మించినప్పటికీ, ప్రస్తుతం అన్ని రైళ్లు 3 కోచ్లతోనే నడుస్తున్నాయి.
రోజూ హైదరాబాద్ మెట్రోలో సగటున 4 లక్షల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పీక్ అవర్స్ లో ఈ సంఖ్య 5 లక్షలకు చేరువ అవుతోంది. నెలకు సుమారు 1.25 కోట్ల నుంచి 1.45 కోట్ల మంది మెట్రో సేవలను ఉపయోగిస్తున్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం, హైటెక్ సిటీ, అమీర్ పేట్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ లాంటి మార్గాల్లో ఉదయం, సాయంత్రం తీవ్ర రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రైల్లో నిలబడేందుకు కూడా స్థలం దొరకడం లేదు.
అయితే, రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ కోచ్లను వెంటనే పెంచడం అంత ఈజీ కాదు. దీనికి ప్రధాన కారణం ఆర్థిక భారం. కొత్త కోచ్లు కొనుగోలు చేయాలంటే భారీగా డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో పీక్ అవర్స్ లో మాత్రమే అదనపు కోచ్లకు డిమాండ్ ఉండటంతో, మిగతా సమయాల్లో అవి ఖాళీగా తిరిగే అవకాశం ఉంది. దీంతో మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంకో ముఖ్యమైన కారణం టెక్నికల్ అంశాలు. ప్రస్తుతం నడుస్తున్న 3 కోచ్ల రైలుకు మరో మూడు కోచ్లు జతచేయడం సాధ్యం కాదు. మెట్రో రైళ్లలో ఉపయోగించే కంట్రోల్ సిస్టమ్, మోటార్, బ్రేకింగ్ వ్యవస్థ, విద్యుత్ సరఫరా లాంటి అంశాలు ఒక నిర్దిష్ట ట్రైన్ సెట్కు అనుగుణంగా రూపొందించబడతాయి. అందువల్ల 6 కోచ్ల రైళ్లు నడపాలంటే కొత్త ట్రైన్ సెట్లను ప్రత్యేకంగా తయారు చేయించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో అధికారులు రద్దీని తగ్గించేందుకు రైళ్ల మధ్య వ్యవధిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పీక్ అవర్స్ లో ప్రతి 2.5 నుంచి 3 నిమిషాలకు ఒక రైలును నడుపుతూ ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో కోచ్ల సంఖ్య పెంచే అవకాశాలపై పరిశీలిస్తున్నారు.
Read Also: రైల్లో తలతిక్క వేషాలు.. వీణ్ణి బొక్కలో వేసి మక్కెలు విరగ్గొట్టండి సర్!