Delhi-Varanasi Vande Bharat Sleeper: ఇప్పటికే హౌరా-కామాఖ్య మధ్య వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాగా, మరో స్లీపర్ రైలు ప్రారంభానికి రెడీ అవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దీపావళికి ముందే ఈ రైలు సర్వీసులు షురూ కానున్నాయి. ఢిల్లీ–వారణాసి మార్గంలో రెండో స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిషన్ రఫ్తార్ లో భాగంగా ఈ రైలును గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో నడిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ప్రతిపాదిత వందే భారత్ స్లీపర్ లో మొత్తం 16 కోచ్లు ఉంటాయి. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ, నాలుగు ఏసీ టూ టైర్, 11 ఏసీ త్రీ టైర్ కోచ్లు ఉండనున్నాయి. ఒకేసారి సుమారు 823 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. న్యూఢిల్లీ నుంచి కాన్పూర్ సెంట్రల్, ప్రయాగ్రాజ్ మీదుగా వారణాసి కంటోన్మెంట్ వరకు ఈ రైలు నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో వ్యాపార ప్రయాణికులు, పర్యాటకులు, వారణాసి, ప్రయాగ్ రాజ్ కు వెళ్లే యాత్రికులకు రాత్రి ప్రయాణం మరింత సౌకర్యంగా మారే అవకాశం ఉంది.
ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం వారణాసి కంటోన్మెంట్ నుంచి రాత్రి సుమారు 9:20 గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రి 10:45 గంటలకు ప్రయాగ్ రాజ్, అర్ధరాత్రి 12:35 గంటలకు కాన్పూర్ సెంట్రల్ చేరుకోనుంది. మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయంలో న్యూఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. అటు ఢిల్లీ నుంచి కూడా రాత్రి సుమారు 9:20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వారణాసి చేరుకునేలా తిరుగు ప్రయాణాన్ని ప్రతిపాదించారు. రాత్రి రైలు ఎక్కిన నిద్రపోతే, ఉదయం లేచే సరికి గమ్యస్థానానికి చేరే అవకాశం ఉంటుంది.
ఉత్తరాదిలో దీపావళి సమయంలో రైళ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో పండుగ ప్రయాణాల సమయంలోనే స్లీపర్ వందే భారత్ను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రారంభ తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రైలు నంబర్, టికెట్ ధరలు, రిజర్వేషన్ తేదీలను కూడా రైల్వే బోర్డు ఇంకా వెల్లడించలేదు. ట్రయల్ రన్లు, భద్రతా అనుమతులు పూర్తయ్యాకే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ–వారణాసి వంటి రద్దీ మార్గంలో స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులు రాత్రిని ప్రయాణానికి ఉపయోగించుకుని, పగటి పూట సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: గర్భిణీలకు రైలులో లోయర్ బెర్త్ రూల్ ఇదే.. అప్పర్ బెర్త్ వస్తే ఏం చేయాలంటే?