IRCTC New update: ఇండియన్ రైల్వే (IRCTC) ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా దళారుల బెడదను తగ్గించి.. సాధారణ ప్రయాణికులకు టికెట్లు సులభంగా దొరికేలా నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి 12 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. రైలు ప్రయాణానికి 60 రోజుల ముందు రిజర్వేషన్ ప్రారంభమయ్యే తొలి రోజున టికెట్ బుక్ చేసుకోవాలంటే ‘ఆధార్ వెరిఫికేషన్’ తప్పనిసరి. దీని వల్ల నకిలీ అకౌంట్లతో టికెట్లు బ్లాక్ చేసే దళారులకు చెక్ పడుతుంది.
ముఖ్యంగా సమయ వేళల విషయంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎవరి అకౌంట్ అయితే ఆధార్తో లింక్ అయి ఉంటుందో.. వారు మాత్రమే రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి రోజు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆధార్ లింక్ లేని వారు మొదటి రోజున టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కోల్పోతారు. వారు కేవలం తర్వాత రోజు నుంచి మిగిలి ఉన్న టికెట్లను మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పు వల్ల సామాన్య ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్లు దొరికే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
అంతే కాకుండా.. ఆధార్ వెరిఫై చేసుకున్న వారికి బుకింగ్ పరిమితిని కూడా పెంచారు. సాధారణంగా ఒక నెలలో 12 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుండగా, ఆధార్ లింక్ చేసిన వారు ఇప్పుడు నెలకు 24 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇలా బుక్ చేసేటప్పుడు ప్రయాణించే వారిలో కనీసం ఒక్కరైనా ఆధార్ వెరిఫైడ్ ప్యాసింజర్ అయి ఉండాలి. ఇది తరచుగా ప్రయాణాలు చేసే వారికి, ఉమ్మడి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: ప్రాణాల మీదకు తెస్తున్న 10 నిమిషాల డెలివరీ.. స్విగ్గీ బాయ్ కు తప్పిన ప్రమాదం
తత్కాల్ టికెట్ల విషయంలో కూడా నిబంధనలు కఠినతరం అయ్యాయి. తత్కాల్ బుకింగ్ చేసేటప్పుడు కూడా ఆధార్ లింక్ తప్పనిసరి చేయడం వల్ల రద్దీ సమయంలో సర్వర్ వేగంగా పని చేస్తుంది. IRCTC అకౌంట్ను ఆధార్తో లింక్ చేయడం చాలా సులభం. IRCTC వెబ్సైట్ లేదా యాప్లో ‘మై అకౌంట్’ సెక్షన్కు వెళ్లి, ‘లింక్ యువర్ ఆధార్‘ ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నంబర్ ఇచ్చి, మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక ప్రొఫైల్ వద్ద గ్రీన్ టిక్ కనిపిస్తుంది. ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిది.