Chennai Airport: చెన్నై ఇంటర్నేషన్ ఎయిర్పోర్టులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందకు దూకడం తోటి ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ప్రయాణికుడు దూకాడు. ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
చెన్నై ఎయిర్పోర్టులో తెల్లవారుజామున ఊహించని ఘటన
ఆదివారం తెల్లవారుజామున షార్జా-చెన్నైకి ఎయిర్ అరేబియా వచ్చింది. విమానం ల్యాండైన తర్వాత రన్వేపై కదులుతుండగానే ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచి విమానం నుండి దూకేశాడు. ఈ సన్నివేశాన్ని చూసి తోటి ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఘటన సమయంలో విమానంలో 231 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ప్రధాన రన్వేను దాటి టాక్సీవేపై నెమ్మదిగా కదులుతోంది. ల్యాండ్ అయిన కొద్ది క్షణాలకు ఈ సంఘటన జరిగింది. ఊహించని పరిణామంతో క్యాబిన్లో సిబ్బంది, తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
విమానం రన్ వేపై కదులుతుండగా ఎమర్జెన్సీ గేటు నుంచి దూకిన ప్రయాణికుడు
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, విమానానికి నష్టం జరగలేదని జాతీయ మీడియా పేర్కొంది. ఈ సంఘటన ప్రధాన రన్వేపై జరగలేదని ఎయిర్పోర్టుకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఆ ప్రయాణికుడు విమానంలో అస్వస్థతకు గురై ఉండవచ్చని, రెండుసార్లు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా అతడు ప్రభావితం కావచ్చని అంటున్నారు.
పైలట్ వెంటనే ఎయిర్పోర్టు అధికారులను అప్రమత్తం చేశాడు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం కలిగింది.
ALSO READ: మిస్సైన 37 ఏళ్లకు తిరిగొచ్చిన విమానం, ఇప్పటికీ అంతు చిక్కని పాన్ ఆమ్ 914 ఫ్లైట్ మిస్టరీ!
ముందుజాగ్రత్త చర్యగా ప్రధాన రన్వేను ఉదయం మూడున్నర నుంచి నాలుగున్నర గంటల వరకు మూసివేశారు. అంతర్జాతీయ విమానాలను మరొక రన్వే వైకి మళ్లించారు. ఆ ప్రయాణికుడు తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాకు చెందినవాడని మీడియా నివేదికలు చెబుతున్నాయి. భద్రతా ఉల్లంఘనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.