Rayachoti Temple: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ దేవికి యశోద కృష్ణ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ధార్మిక చింతనను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో రూ.30 కోట్లతో ఆలయాల నిర్మాణానికి నిధులు తీసుకురావడం గొప్ప విషయమని మంత్రులు కొనియాడారు. గతంలో ఆలయాల కోసం ప్రజలు చందాలు వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సి.జి.ఎఫ్ (CGF), టీటీడీ నిధులతో స్వయంగా ఆలయాలను నిర్మిస్తోందని తెలిపారు. రాయచోటి పరిధిలోని 900 పల్లెల్లో ప్రతి గ్రామంలోనూ ఒక ఆలయాన్ని నిర్మించి తీరుతామని, ఆధ్యాత్మికత పెరిగితేనే సమాజంలో శాంతి సౌభాగ్యాలు విరాజిల్లుతాయని వారు ఆకాంక్షించారు.
ఇదే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల పాలనలో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారని, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేవలం కొబ్బరికాయలు కొట్టి కాలయాపన చేశారని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు జల జీవన్ మిషన్ ద్వారా నిధులు సాధించారని, 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గూగుల్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని, రానున్న కాలంలో 9 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తూనే, హిందూ ధర్మ పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పునరుద్ఘాటించారు.
Also Read: కరీంనగర్లో తుపాకుల మోత.. పట్టపగలే జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ!